కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాక్ కుట్ర

కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాక్ కుట్ర
కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాకిస్థాన్ కుట్ర పన్నుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశం పర్యాటకానికి వ్యతిరేకమని, జమ్ముకశ్మీర్‌లోని పేదలపై పాక్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తద్వారా ఇక్కడి పేదల పొట్టగొట్టాలని పాక్ చూస్తోందని దుయ్యబట్టారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రధాని స్పష్టం చేశారు. 
 
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ  పాక్‌ కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత్‌ ఎండగడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కశ్మీర్‌ లోయకు రైలును నడపాలన్న కల నేటికి సాకారమైందని చెప్పారు. చినాబ్‌ వంతెన ప్రారంభం సందర్భంగా కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ భారతీయ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్‌ రైల్వే తీగల వంతెన ఒక నిదర్శనం కొడియాడారు.

“మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం వల్ల జమ్మూకశ్మీర్​ను మరింత అభివృద్ధి చేసుకుంటున్నాం. దాదాపు రూ.40వేల కోట్లతో జమ్మూలో అభివృద్ధికి బాటలు వేశాం. బ్రిటీష్ కాలం నాటి ప్రణాళిక నేటికి కార్యరూపం దాల్చింది. అందుకే చినాబ్ రైల్వే బ్రిడ్జ్​, అంజిర్ వంతెనలు జాతికి అంకితం చేశాం. మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపించాం. ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధి మరింతగా కొంత పుంతలు తొక్కుతుంది” అంటూ ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.

జమ్మూకశ్మీర్​ సహా దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు పేదలను రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. “జమ్మూకశ్మీర్​లో గత ఐదేళ్లలో 5 కొత్త వైద్య కళాశాలు ప్రారంభించాం. దీనితో మెడికల్ సీట్లు 500 నుంచి 1300కు పెరిగాయి. మా హయాంలో 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మంది ప్రజలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. ఎన్​డీఏ హయంలో 50 కోట్ల జన్​ధన్​ ఖాతాలు తెరవబడ్డాయి” అని ప్రధాని తెలిపారు. 

“స్వచ్ఛభారత్ కింద 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. జల్​జీవన్​ మిషన్ కింద 12 కోట్ల ఇళ్లకు వాటర్ కనెక్షన్ ఇచ్చాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏకంగా 10 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం” అని వివరించారు.  ఈ సందర్భంగా పాకిస్థాన్​పై ప్రధాని మోదీ నిప్పులు చెరుగుతూ ఇకపై ఆపరేషన్ సిందూర్​ పేరు విన్నప్పుడల్లా పాకిస్థాన్​కు ఓటమి గుర్తుకువస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. అయితే ఈ పోరాటంలో జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. 

అలాగే భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి అదనంగా రూ.2 లక్షలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కోసం రూ.1 లక్ష ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ వంతెన జమ్ము కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జ్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం ఇచ్చారు