ప్రభుత్వం వచ్చి ఏడాదైనా  సీఎంను కలవని సినీ పెద్దలు

ప్రభుత్వం వచ్చి ఏడాదైనా  సీఎంను కలవని సినీ పెద్దలు
ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకూడదని చూస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని పేర్కొంటూ  అంతా కలసి రావాలని తాను సూచించినా సానుకూలంగా స్పందించకపోవడం సరికాదని హితవు చెప్పారు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్లకు గురిచేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయనే భావన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 

గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని, అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పారు.

 ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్‌ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారని సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ, పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తమకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటూ రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రితోనూ చర్చించనున్నానని అనంతరం పూర్తిస్థాయిలో ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ పాలసీని ప్రకటిస్తారని ఉపముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.