
స్వర్ణాంధ్ర విజన్-2047తో 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పి-4తో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ 4వ నుంచి త్వరలో 3వ స్థానానికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్గా ట్రాక్ చేస్తోందని తెలిపారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమంతో నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకొచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ పార్క్ను ప్రవేశపెడుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను కూడా సిఎం చంద్రబాబు సమావేశంలో వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నెన్సులో గూగుల్ ఎఐ టెక్నాలజీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ క్రియేట్ చేస్తున్నామని వివరించారు. టాటా ఇన్నోవేషన్ హబ్, ఎఐ ఆధారిత పాలనతో రాష్ట్రం స్టార్టప్లకు, ఉద్యోగ సృష్టికి మార్గదర్శకంగా మారిందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, ఉద్యోగ సృష్టి వంటి అంశాలపై దృష్టి పెట్టి, పిపిపి ప్రాజెక్టులకు కేంద్రం వయబిలిటీ గ్యాఫ్ ఫండింగ్కు మద్దతుగా ఉండటంతో జిడిపి వృద్ధికి దోహదపడుతుందని సిఎం చెప్పారు.
పాపులేషన్ మేనేజ్మెంట్తో దేశంలో వృద్ధుల శాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని చంద్రబాబు సూచించారు. ఈ ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు, మాతృత్వ సెలవులు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకత్వం వహించేలా ఎపి ముందుండి నడవడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
నీతీ ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను బ్లూ ప్రింట్ (ప్రణాళిక) ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని సూచించారు. చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని మోదీ కొనియాడారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు