బలూచ్‌ బాంబ్‌ దాడిపై పాక్‌ ఆరోపణలు తోసిపుచ్చిన భారత్

బలూచ్‌ బాంబ్‌ దాడిపై పాక్‌ ఆరోపణలు తోసిపుచ్చిన భారత్
బలూచిస్థాన్‌లో స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో ప్రమేయం ఉందన్న పాకిస్థాన్‌ ఆరోపణలను భారత్‌ తోసిపుచ్చింది. పాక్‌ సైన్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది. ఉగ్రవాదానికి కేంద్రంగా పేరుగాంచిన పొరుగు దేశం అలాంటి వాదనలు చేయడం సాధారణమని పేర్కొంది.  బలూచిస్థాన్‌లోని స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో నలుగురు విద్యార్థులు సహా ఆరుగురు మరణించారని, 12 మందికి పైగా గాయపడ్డారని బలూచిస్థాన్‌ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి మీడియాకు తెలిపారు. 
ఓ పాఠశాల బస్సును  ఆత్మాహుతి ఆత్మాహుతి బాంబు గల కారు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ కు చెందిన బస్సు ఈ ఉదయం పిల్లల్ని తీసుకొని వెళ్తోంది. ఆ సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది. సూసైడ్‌ బాంబ్‌తో వచ్చిన కారు బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటన బలోచిస్థాన్‌ లోని కుజ్‌దార్‌ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

కాగా, ఈ దాడిలో భారత్‌ ప్రమేయం ఉందని పాకిస్థాన్‌ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్‌) ఆరోపించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిని తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసారు. “ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉన్న దాని ఖ్యాతి నుంచి దృష్టిని మళ్లించడానికి, సొంత ఘోర వైఫల్యాలను దాచడానికి, పాకిస్థాన్‌ తన అంతర్గత సమస్యలన్నింటికీ భారత్‌ను నిందించడం ఆ దేశ స్వభావంగా మారింది” అని విమర్శించారు.