బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైరపర్సన్‌ జకియా ఖానం

బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైరపర్సన్‌ జకియా ఖానం
 ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైరపర్సన్‌ జకియా ఖానం రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆమె తన ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ పదవికీ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జకియా ఖానంతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌, కర్రి పద్మశ్రీ, పోతుల సునీతలు ఉన్నారు.
 
 జకియా ఖానంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్​తో కలిసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషదాయకమని పురందేశ్వరి, సత్యకుమార్ అన్నారు. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా ఖానం అన్నారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీయేనని ఆమె కొనియాడారు. ముస్లిం మైనారిటీల నుంచి మంచి సందేశమిచ్చేందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు.
 
రాయచోటి నియోజకవర్గం నుంచి బలమైన మైనారిటీ నేతగా జకియా ఖానం పేరుంది. ఆమె భర్త అఫ్జల్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఉంటూ రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్​గా పని చేశారు. వైయస్సార్ మరణం అనంతరం వైఎస్సార్సీపీలో కొనసాగుతూ వచ్చారు. మైనారిటీ నాయకుడిగా ఉంటూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో అఫ్జల్ అలీఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని అప్పట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హామీ ఇచ్చారు.

ఆమెకు 2020 జులైలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టారు. ఆరు నెలల లోపునే శాసనమండలి డిప్యూటీ చైర్మన్​గా ఆమెకు కేబినెట్ హోదా కల్పిస్తూ పదవి ఇచ్చారు. కానీ ఆమెకు స్థానికంగా తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి మొదటి నుంచి ఉండేది. స్థానికంగా జరిగే అధికారిక కార్యక్రమాలలో గాని రాష్ట్రస్థాయిలో జరిగే ఎలాంటి అధికారిక కార్యక్రమాలలో ఆమెకు పాల్గొనేందుకు తగిన అవకాశం కల్పించకుండా అణగదొక్కారనే బలమైన అసంతృప్తితో రగిలిపోతూ వచ్చారు.

2023 నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. వైఎస్సార్సీపీలో సముచిత స్థానం లేకపోవడం అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తనను అణగదొక్కుతూ వచ్చారన్న విషయాన్ని ఆమె పార్టీ అధిష్టానం దృష్టి కూడా పలుమార్లు తీసుకెళ్లింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో గత ఎన్నికల సమయంలోనే ఆమె స్తబ్దతగా ఉండిపోయారు. కూటమీ ప్రభుత్వం రాగానే టీడీపీ యువ నాయకుడు లోకేశ్​ను కలిశారు. శాసన మండలిలో కూడా ఆమె పెద్దగా పాత్ర పోషించలేదు.

గత ఆరు నెలల కిందట టీటీడీ దర్శన టికెట్లను జకియా ఖానం అమ్ముకున్నారన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతల బయటపెట్టారని ప్రచారం సాగింది. స్థానికంగా ఆమెను బలహీనపరిచేందుకు సామాజిక మధ్యమాలలోనూ వైఎస్సార్సీపీ నాయకులు పోస్టులు పెడితే వచ్చారు. ఈ వ్యవహారాలన్నీ కలగలిపి తన రాజీనామాకు దారి తీసాయి అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాయచోటి మైనార్టీ వర్గాలలో ఓ బలమైన నేత వైఎస్సార్సీపీను విడటం చర్చనీ అంశమైంది.