మూడో రోజు సరిహద్దుల్లో 26 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులు

మూడో రోజు సరిహద్దుల్లో 26 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులు
 
* ఢిల్లీ లక్ష్యంగా చేసుకున్న  రెండు క్షీపణులు కూల్చివేత

ఆపరేషన్‌ సిందూర్ తర్వాత భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ 26 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులకు యత్నించగా భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్‌ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా, భారత్‌ వాటిని నిర్వీర్యం చేసింది.

రాజధాని ఢిల్లీ లక్ష్యంగా చేసుకున్న దాయాది పాక్ ఫతాహ్-1. ఫతహ్-2 మిస్సై్ల్స్‌ను ప్రయోగించింది. అయితే ఆ క్షిపణులు లక్ష్యం చేరకముందే ఇండియన్ ఆర్మీ అడ్డుకుని గాల్లోనే కూల్చి చేసింది. పాక్ మిస్సైల్స్‌ను ఆకాశ్, బరాక్-8 సిస్టమ్స్ సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. హర్యానా ప్రాంతంలోని సిర్సాలో పాక్ క్షిపణి కూలినట్లుగా సమాచారం అందుతోంది.  జనవాసాలు టార్గెట్‌గా పాక్‌ దాడులు చేస్తోంది.

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్, అవంతీపొరా ఎయిర్‌బేస్‌ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. డ్రోన్‌ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్‌ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు సంధించింది. 

అయితే వాటిని భారత్ సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. ముఖ్యంగా శ్రీనగర్‌ విమానాశ్రయం, అవంతీపొరా వైమానిక స్థావరం లక్ష్యంగా వదిలిన డ్రోన్లను నేలకూల్చింది. జమ్ము, ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, బాడ్‌మేడ్, భుజ్‌ ప్రాంతాలపైకి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. 

అయితే పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జనావాసాలపై పాకిస్థాన్ డ్రోన్‌ దాడి చేయగా, అది ఓ భవనంపై పడింది. అందులో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాకిస్థాన్ డ్రోన్లను పంపించిన క్రమంలో సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల బాంబుపేలుళ్లు వినిపించగా అప్పటికప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేసి బ్లాకౌట్‌ పాటించారు. 

అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ము, సాంబ జిల్లాల్లో ఫిరంగులతో శత్రుమూకలు విరుచుకుపడ్డాయి. జమ్ము, దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. డ్రోన్‌ దాడులను దృష్టిలో పెట్టుకొని శ్రీనగర్‌ ప్రజలకు ముందుజాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించారు. జమ్ము డివిజన్‌ ఉధంపుర్‌లో పూర్తిగా బ్లాక్‌ అవుట్‌ పాటించారు. 

ఆ ప్రాంతంలో భారీగా సైరన్‌ శబ్దాలు వినిపించాయి. జమ్ము, అఖ్నూర్, హరియాణాలోని అంబాలా, పంచ్‌కుల, పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్, అమృత్‌సర్, హోశియార్‌పుర్,మోగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాక్‌ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి.