భారత్లో 8 వేల ‘ఎక్స్’ అకౌంట్స్ బ్లాక్

భారత్లో 8 వేల ‘ఎక్స్’ అకౌంట్స్ బ్లాక్
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ కార్యనిర్వాహక ఆదేశాల మేరకు దేశంలోని 8 వేల ‘ఎక్స్’ ఖాతాలను నిలిపివేసినట్లు గురువారం ప్రకటించింది. తమ ఆదేశాలను పాటించకపోతే కంపెనీ స్థానిక ఉద్యోగులకు జరిమానా విధించడం సహా నిర్బంధంలోకి తీసుకోవాల్సి వస్తుందన్న హెచ్చరికనూ భారత ప్రభుత్వం చేసిందని వెల్లడించింది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన ‘ఎక్స్‌’ ఖాతాల నిలిపివేతకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ప్రభుత్వం నిలిపివేయాలని కోరిన వాటిలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ ఎక్స్‌ వినియోగదారుల ఖాతాలు ఉన్నాయని వెల్లడించింది. 

“చాలా సందర్భాలలో ఒక ఖాతా నుంచి ఏ పోస్టులు భారతదేశ స్థానిక చట్టాలను ఉల్లంఘించాయో ప్రభుత్వం పేర్కొనలేదు. గణనీయమైన సంఖ్యలో ఖాతాలను బ్లాక్ చేయడానికి మాకు ఎటువంటి ఆధారాలు అందలేదు. సర్కార్ డిమాండ్లతో మేము విభేదిస్తున్నాము. మొత్తం ఖాతాలను బ్లాక్ చేయడం అనవసరం మాత్రమే కాదు. ఇది ఇప్పటికే ఉన్న భవిష్యత్తు కంటెంట్‌ ను సెన్సార్‌ షిప్ చేయడం లాంటిది.” అని ఎక్స్ పేర్కొంది.

“ఈ కార్యనిర్వాహక ఆదేశాలను బహిరంగపరచడం పారదర్శకతకు చాలా అవసరమని మేము విశ్వసిస్తున్నాము. అలాగే ఆదేశాలను బహిర్గతం చేయకపోతే జవాబుదారీతనం దెబ్బతింటుంది. ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది. అయితే, చట్టపరమైన పరిమితుల కారణంగా మేము ఈ సమయంలో కార్యనిర్వాహక ఆదేశాలను వెల్లడించలేకపోతున్నాం. కంపెనీకి అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నాం. మా విధానాలకు అనుగుణంగా వినియోగదారులకు చర్యల నోటీసును అందించాం. వారు cyberlaw@meity.gov.in వెబ్ సైట్ ద్వారా భారత ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు.” అని ఎక్స్ తెలిపింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ పై భారత్‌ అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాక్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ల ‘ఎక్స్’ ఖాతాలపై వేటు వేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ పై వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది భారత సర్కార్. పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్లు , న్యూస్‌, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లను కూడా నిలిపివేసింది.