భారత సైన్యం అదుపులో పాకిస్థాన్‌ పైలట్‌

భారత సైన్యం అదుపులో పాకిస్థాన్‌ పైలట్‌
*  2 పాక్ ఫైటర్‌ జెట్లను కూల్చివేత.. కరాచీ రేవుపై భీకర దాడి

పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన రెండు ఫైటర్‌ జెట్లను భారత సైన్యం కూల్చి వేసింది. ఇందులో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూడా ఉంది. అంతేకాదు ఈ ఎఫ్‌-16 పైలట్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. జలంధర్‌లో పాక్‌ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్, భారత సరిహద్దు రాష్ట్రాల్లోని​ జనావాసాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అంతేకాదు పోఖ్రాన్‌ ఆర్మీ స్టేషన్‌పై దాడికి యత్నించింది. మిసైళ్లు, డ్రోన్​లను ప్రయోగించింది.

మొత్తంగా చూసుకుంటే హమాస్​ తరహా దాడులకు పాక్ విఫలయత్నం చేసింది. అయితే పాక్ దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది.  పాక్​కు చెందిన 8 మిసైళ్లను, డ్రోన్​లను, 2 ఫైటర్ జెట్​లను కూల్చేసింది. అంతేకాదు పాకిస్థాన్​లోని సర్గోధా, ఫైసలాబాద్​లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా భారత వాయుసేన కూల్చేసింది. 

మరోవంక, అరేబియా సముద్రంలోని ఐఎఫ్ఎస్‌ విక్రాంత్‌ బ్యాటిల్‌ గ్రూప్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దెబ్బకు పోర్టు మంటల్లో చిక్కుకుంది. అక్కడి 10-12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్‌ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వార్తా కథనాలు వెలువడ్డాయి.  దీనికి సంబంధించి అటు పాక్‌, ఇటు భారత సైనిక వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. 

కానీ, నావికా దళంలోని ఉన్నతస్థాయి వర్గాలను ఉటంకిస్తూ పలు టీవీ చానళ్లు, వెబ్‌సైట్లు కథనాలను ప్రసారం చేశాయి. అలాగే, పాకిస్థాన్‌లోని కీలక నావికా స్థావరాలపైనా భారతీయ నావికా దళం దాడులు చేసినట్లు సమాచారం.  సముద్రంలోఐఎఫ్ఎస్‌విక్రాంత్‌తోపాటు 26 భారతీయ యుద్ధ నౌకలు ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో కరాచీ, ఓమ్రారా పోర్టులపైఐఎఫ్ఎస్‌ విక్రాంత్‌ క్షిపణుల వర్షం కురిపించింది. ఆ సమయంలో కరాచీ నగరమంతా ఆకాశంలో నల్లగా పొగ కమ్మేసింది.

పోర్టులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. పది నుంచి 12 నౌకలు పూర్తిస్థాయిలో ధ్వంసమైనట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.  కరాచీ పోర్టులోని కీలక ప్రాంతాలు కూడా మంటల్లో అంటుకున్నాయని, దాంతో, స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని వివరించాయి. దాడుల్లో రెండు పోర్టులు తీవ్ర స్థాయిలో ధ్వంసమయ్యాయని, పాకిస్థాన్‌ రక్షణ సామర్థ్యాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని స్థానిక వర్గాలు తెలిపాయి.

పాక్ ఉగ్రవాదుల తరహాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విమానయాన శాఖ సూచించింది. విమానాశ్రయ టెర్మినల్‌ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని నిర్దేశించింది.