భారత్- పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర

భారత్- పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర

పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు అకస్మాత్తుగా భారత్‌పై అకారణంగా విషం కక్కడం వెనక చైనా హస్తం ఉందని ఓ అమెరికా వ్యాపారవేత్త తాజాగా ఆరోపించారు. అమెరికా వాణిజ్య సుంకాల విధింపు తర్వాత భారత్ వాణిజ్యపరంగా తనకు పోటీగా మారిన తరుణంలో ప్రాంతీయ ఉద్రిక్తతల కుంపట్లు రాజేస్తుందని ఎక్స్ వేదికగా కుండబద్దలు కొట్టారు. అమెరికన్ వ్యాపారవేత్త ప్యాట్రిక్ బెట్ డేవిడ్ ఈ మేరకు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.

‘‘భారత్, పాక్ మధ్య ఈ సమయంలో ఉద్రిక్తతలు రేగడం ఆసక్తికరం. యాపిల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను భారత్‌కు మళ్లిస్తున్నామని ప్రకటించగానే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. అమెరికా విధించిన సుంకాలు చైనాను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వాణిజ్యం భారత్ వైపు మళ్లుతోంది. దీంతో, తనకు పోటీగా నిలవగలిగిన ఓకే ఒక దేశంలో చైనా ఉద్రిక్తతలను ఈ విధంగా ప్రోత్సహిస్తోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

యాపిల్ సంస్థ తన ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌కు మళ్లిస్తున్నట్టు ఇటీవల ప్రకటించడం వాణిజ్య ప్రపంచంలో సంచలనంగా మారింది. చైనా కేంద్రంగా ఉన్న గ్లోబల్ సప్లయ్ చైన్‌ను సమూలంగా మార్చివేసే ఘటన ఇది. 2026 ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్‌లో ఉత్పత్తి చేయించాలని యాపిల్ నిర్ణయించుకుంది.  దీంతో, అమెరికాలో విక్రయించే ఐఫోన్లన్నీ దాదాపుగా భారత్‌లో తయారవుతాయి.  యాపిల్‌కు చైనా సంస్థల అవసరం తగ్గిపోతుంది. ఈ విషయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే విస్పష్టమైన ప్రకటన చేశారు. భారత్‌లోని ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో కలిసి ఐఫోన్ తయారీ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు.

యాపిల్ సప్లై నెట్‌వర్క్‌లో భారత్ ఇప్పటికే కీలకంగా మారింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల ఉత్పత్తిలో భారత్ వాటా 18 నుంచి 20 శాతంగా ఉంది. ఈ ఏడాది చివరికి ఇది 30 శాతానికి చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దేశీ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం భారత్‌వైపు పలు సంస్థలను మళ్లేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వ్యాపార అనుకూల వాతావరణం, సుస్థిర ప్రభుత్వ విధానాల కారణంగా భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా మారుతోంది.