బ్రిటన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

బ్రిటన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్- బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో ఫోన్‌ సంభాషణ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ప్రకటన చేశారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, సామాజిక భద్రతా ఒప్పందం ఖరారైనట్లు ఆయన వెల్లడించారు.  ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ ఎఫ్టీఏ డీల్ ఓ మైలురాయిగా అభివర్ణించారు. దీనివల్ల ఇరు దేశాలకు లాభదాయకమని తెలిపారు. 
మరోవైపు బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌ భారత్‌లో పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరుదేశాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ వాణిజ్య ఒప్పందంపై అవగాహన కుదిరినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఇది చారిత్రక ఒప్పందమని హర్షం వ్యక్తం చేశారు.

”భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఈ ఒప్పందం ఉభయదేశాలకు ప్రయోజనకరం. ఇదొక చారిత్ర మైలురాయి. ఇది ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగాలను కల్పన, ఆవిష్కరణలను మరింతగా పాదుకొలుపుతుంది. త్వరలోనే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు భారత్‌లో ఆహ్వానం పలికేందుకు ఎదురుచూస్తున్నా” అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల మధ్య గత మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి.  మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి. ఆల్కహాల్, ఆటోమొబైల్స్‌పై సుంకాలు సహా సహా పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు, యూకే రాజకీయ పరిణామాలతో జాప్యం జరుగుతూ వచ్చింది.

ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు ఇవే! 
  • 99 శాతం భారతీయ ఎగుమతులు యూకే మార్కెట్లో జీరో సుంకం వల్ల ప్రయోజనం పొందుతాయి.
  • భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకం తగ్గుతుంది. 90 శాతం ఉత్పత్తులపై తగ్గించిన సుంకాలు లాక్ అవుతాయి. వీటిలో 85 శాతం భారతీయ ఉత్పత్తులు ఓ దశాబ్దంపాటు పూర్తిగా సుంక రహితంగా ఉంటాయి.
  • విస్కీ, జిన్లపై సుంకాలు 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గిస్తారు. ఆ తరువాత ఒప్పందం జరిగిన పదేళ్లలో వీటిపై సుంకాలు 40 శాతానికి తగ్గిస్తారు.
  • ఆటోమోటివ్ సుంకాలు కోటా కింద 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతాయి.
  • సౌందర్య సాధనాలు, ఏరోస్పేస్, ల్యాంబ్, వైద్య పరికరాలు, సాల్మన్, విద్యుత్ యంత్రాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, బిస్కెట్లపై కూడా సుంకాలు తగ్గుతాయి. దీని వల్ల భారతీయ వ్యాపారులకు చాలా మేలు చేకూరనుంది.
  • యూకే సుంకాలు సరళీకరించిన నేపథ్యంలో బ్రిటీష్ వారికి దుస్తులు, పాదరక్షలు, ఘనీభవించిన రొయ్యలు వంటి ఆహార ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి.
  • భారత్, యూకేల మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల దీర్ఘకాలంలో ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 25.5 బిలియన్లు మేర పెరగవచ్చు. అలాగే యూకే జీడీపీ 4.8 బిలియన్లు, వేతనాలు 2.2 బిలియన్ల మేర పెరగవచ్చని అంచనా.
  • ఈ డీల్ వల్ల వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, బొమ్మలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, ఇంజిన్లు, సేంద్రియ ఎరువులు లాంటి రంగాలకు ఎగుమతి అవకాశాలు పెరుగుతాయి.
  • ఐటీ/ITeS, ఆర్థిక, విద్య, వృత్తి పరమైన, ఇతర వ్యాపార సేవలకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది.
  • యూకేలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు సామాజాకి భద్రతా చెల్లింపుల నుంచి ముూడేళ్ల పాటు మినహాయింపు లభిస్తుంది.
  • ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి యూఎస్డీ 60 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపు అవుతుందని అంచనా.
  • ఎఫ్టీఏ వల్ల కాంట్రాక్ట్ సర్వీస్ సరఫరాదారులు, బిజినెస్ విజిటర్లు, పెట్టుబడిదారులు, ఇంట్రా-కార్పొరేట్ బదిలీదారులు, యోగా బోధకులు, సంగీతకారులు, చెఫ్లు లాంటి వారు సులువుగా యూకే వెల్లడానికి వీలవుతుంది.
  • ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, కంప్యూటర్, టెలికమ్యునికేషన్ సేవలు లాంటి డిజిటల్ సేవల విషయంలో భారత్కు లబ్ది చేకూరుతుంది.
  • డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకేలో తాత్కాలికంగా ఉన్న భారతీయ కార్మికులు, వారి యజమానులు మూడేళ్లపాటు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందుతారు. దీని వల్ల యూకేలో భారతీయల పోటీతత్వం పెరుగుతుంది.
  • వస్తు, సేవల స్వేచ్చా వాణిజ్యం వల్ల భారతీయ ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. నాన్-టారిఫ్ అడ్డంకులు తొలగిపోతాయి.

ఈ ఎఫ్‌టీఏతో యూకే మార్కెట్లో భారతీయ ఎగుమతిదారులకు మరింత లబ్ది చేకూరనుందని పారిశ్రామిక సంఘాలు తెలిపాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత వాతావరణంలో ఈ ఎఫ్‌టీఏతో ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌, ఇన్నోవేషన్‌ ఆధారిత పరిశ్రమలకు లాభం చేకూరనుందని ఫిక్కీ ప్రెసిడెంట్‌ హర్ష వర్ధన్‌ అగర్వాల్‌ అన్నారు. 

అంతేకాకుండా 2030 నాటికి భారత్‌-యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 10,000 కోట్ల డాలర్ల (రూ.8.5 లక్షల కోట్లు)కు చేర్చే అవకాశం లభించనుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ అధ్యక్షుడు సంజీవ్‌ పురి ఆశాభావం వ్యక్తం చేశారు. సుంకాల యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఎఫ్‌టీఏ మరింత ప్రాధాన్యత సంతరించుకుందని సీఐఐ యూకే-ఇండియా బిజినెస్‌ ఫోరం చైర్మన్‌ కేశవ్‌ మురుగేశ్‌ తెలిపారు. 

ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులకు ఉన్న ఆటంకాలూ తొలగిపోతాయని యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ) పేర్కొంది. ఈ ఎఫ్‌టీఏ రెండు దేశాల ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాలు, నవకల్పనలకూ దోహదం చేస్తుందని యూకేఐబీసీ చైర్మన్‌ రిచర్డ్‌ హీల్డ్‌ చెప్పారు