
సింహాచలం దేవస్థానం దుర్ఘటనపై కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్దారించిన కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురు అధికారుల సస్పెన్షన్కు ఆదేశించింది. కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణతో పాటు, ఇద్దరు అధికారులరై క్రిమినల్ చర్యలకు నిర్ణయం తీసుకుంది.
సింహాచలం దేవస్థానం ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ, సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ ఏబీవీ ఎల్ఆర్ స్వామి, ఏపీటీడీసీ ఏఈ మదన్ మోహన్, సింహాచలం దేవస్థానం జేఈ బాబ్జీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సింహాచలంలో గోడకూలిన ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిషన్ చైర్మన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందించారు. ఏప్రిల్ 30 తేదీన చందనోత్సవం రోజు భారీ వర్షానికి సింహాచలంలో గోడకూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు.
తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరి బరువు కారణంగా గోడ కూలినట్టు కమిషన్ అభిప్రాయపడింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని నివేదికలో వెల్లడించారు. చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు స్పష్టం చేశారు.
సంవత్సరానికి ఒకరోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం అర్ధరాత్రి దాటినప్పటి నుంచే క్యూలైన్లలో భక్తులు నిలుచున్నారు. గోడ కూలడంతో ఏడుగురు భక్తులను మృత్యువు కబళించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి గోడ కూలి పడటంతో వారంతా మృతి చెందారు. వీరిలో 4 ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. మృతులంతా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలవారే. బాధితులు, వారి కుటుంబీకుల ఆర్తనాదాలతో ఆ రోజు సింహాచలంలోని ఆప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది.
More Stories
సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 42 లక్షలు నగదు
రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం
నాలుగన్నర గంటల్లోనే విజయవాడ నుండి తిరుపతి