
* సగం పనిచేయని ఆయుధాలతో యుద్ధం పట్ల పాక్ సైన్యంలో వణుకు
సగానికి పైగా పనిచేయని ఆయుధ సామాగ్రి, రిపేర్లో ఉన్న యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సరిపడా లేని శతఘ్ని గుండ్లు, ఐదు రోజులుకు మించి లేని ఇంధనం, చేతిలో లేని విదేశీ మారక ద్రవ్యం ఇది పాకిస్థాన్ పరిస్థితి. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము కానీ, సత్తా కానీ పాక్కు లేదని విషయం వారి సైనిక శక్తిని చూస్తే అర్థమవుతుంది.
ఒకవేళ యుద్ధం మొదలైతే ఏడు రోజులకు మించి పాకిస్థాన్ యుద్ధం చేయలేదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. భారత్తో పోరాడే సత్తా తమ వద్ద లేదని పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్కు ఇప్పటికే ఆ దేశ నౌకదళం, ఎయిర్ చీఫ్లు చెప్పినట్లు తెలుస్తోంది. సింధూ జలాల్లో భారతీయుల రక్తం ఏరులై పారుతుందని, సింధూ జలాలపై భారత్ నిర్మించే ఎలాంటి నిర్మాణాన్నైనా ధ్వంసం చేస్తామని పాకిస్థాన్ బీరాలు పలుకుతోంది.
అక్కడి నేతలు యుద్ధోన్మాద వ్యాఖ్యలతో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత్ సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో పాక్లో ఆందోళనలు పెరిగాయి. అప్పటి వరకు వట్టి ప్రగల్భాలు పలికిన పాక్ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ సమయంలో భారత్ దాడి చేస్తుందో అని బిక్కు బిక్కు మంటున్నారు.
పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా భారత్తో నేరుగా పోరాడే సత్తా తమకు లేదనే విషయం పాక్ సైనిక నాయకత్వానికి తెలుసు. ఇదే విషయాన్ని ఆ దేశ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్కు ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్ వెల్లడించారు. తమ వద్ద సరైన ఆయుధ సామర్థ్యం లేదని భారత్ను ఎదుర్కొనే స్థితిలో పాక్ లేదని ఖరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఒక వేళ నిజంగా యుద్ధం వస్తే తమ వద్ద ఉన్న ఆయుధాలతో భారత్ను ఏడు రోజులు మాత్రమే పాక్ ఆపగలదు. అలా అయితే మునుపెన్నడూ చూడని ఘోర పరాభవాన్ని పాక్ చవిచూడనుంది. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో సగం పనిచేసే స్థితిలో లేవు. వారి వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో ప్రధానమైన ఎఫ్-16 ఫైటర్జెట్లలో 55 శాతం పనిచేయడం లేదని ఆ దేశ ఎయిర్ మార్షల్ ఇటీవల జరిగిన కోర్ కమాండర్ల సమావేశంలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమెరికా ఇచ్చిన 400 మిలియన్ల డాలర్ల ప్యాకేజీతో వాటిని అప్గ్రేడ్ చేస్తున్నారు. అటు పాక్ రాడార్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. పాక్కు ఉన్న 160 జేఎఫ్ థండర్ జెట్స్లో సగం పనిచేయడం లేదు. ఏఈఎస్ఏ రాడార్లలో చాలా వరకు పనిచేయడం లేదు. వాటి రేంజ్ కేవలం వంద నుంచి 110 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అటు పాకిస్థాన్ వద్ద ఉన్న హెచ్క్యూ-9పీ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి ఉన్నా దాని సామర్థ్యం భారత్ వద్ద ఉన్న ఎస్-400 కంటే తక్కువే.
అటు పాక్ నౌకదళం కూడా ఆందోళన చెందుతోంది. వారి వద్ద ఉన్న 80 శాతం సబ్ మెరైన్లు పనిచేయడం లేదు. పాక్ వద్ద మొత్తం 8 ఉంటే, అందులో 5 అగోస్టా క్లాస్ జలాంతర్గాములు, 3 మిడ్జెట్ జలాంతర్గామిలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిల్లో రెండు అగోస్టా క్లాస్ సబ్మెరైన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మరోవైపు పాక్కు సరిపడా ఇంధనం కూడా లేదు. యుద్ధం మొదలైతే కేవలం ఐదు రోజులకు సరిపడా ఇంధనం మాత్రమే వారి వద్ద ఉంది.
స్వదేశీయంగా తయారుచేసుకున్న ఆయుధ సంపద లేకపోవడం పాక్కు ప్రతికూలాంశంగా మారింది. ఆయుధ సామాగ్రిలో చైనా నుంచి 45 శాతం, అమెరికా నుంచి 20 శాతం పాక్ దిగుమతి చేసుకుంది. వైమానిక రంగంలో 35 నుంచి 45 శాతం ఫ్రాన్స్ నుంచి పాక్ దిగుమతి చేసుకుంది. గత నాలుగు, ఐదేళ్లుగా తుర్కియే వారికి ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది.
అంతేకాదు పాక్కు ఉన్న ఆయుధ సంపదలో 55 శాతం పాతకాలానికి చెందినవే ఉన్నాయి. భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్థాన్ వద్ద శతఘ్ని గుండ్లు కేవలం నాలుగు రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఓ ఆంగ్ల వార్త సంస్థ కథనంలో పేర్కొంది. ఆ దేశం వద్ద ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో వీటి నిల్వలు ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ గుండ్లకు డిమాండ్ పెరగడంతో పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కాలంలో పాక్ యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్కు విక్రయించడంతో దాయాది వద్ద నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది.
భారత్కు ఇజ్రాయెల్ లాగా ఐరెన్ డోమ్ లేకపోవచ్చు గానీ, పటిష్ఠమైన గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. ఒక వేళ యుద్ధంలో పాక్ తన ఎఫ్-16 యుద్ధవిమానాలను రంగంలోకి దించినా వాటికి సమాధానంగా భారత్ వద్ద రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 క్షిపణులు ఉన్నాయి. 400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే సామర్థ్యం వీటి సొంతం.
రష్యా ,ఉక్రెయిన్ యుద్ధంలో ఎఫ్-16 యుద్ధవిమానాలను ఎస్-400 క్షిపణలు ధ్వంసం చేశాయి. ఇప్పుడివే పాక్ సైనిక నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నాయి. అందుకే ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత్ సరిహద్దుల నుంచి ఎస్-400 క్షిపణి పరిధికి దూరంగా గ్వాదర్లోని ఎయిర్ ఫీల్డ్కి పాకిస్తాన్ తరలించింది.
అలాగే రఫేల్ యుద్ధవిమానాలతో సహా బ్రహ్మోస్, సుఖోయ్ వంటి అత్యాధునిక ఆయుధ సంపద భారత్ సొంతం. భారత్ రఫేల్పై చేసిన ఖర్చు పాక్ ఒక ఏడాది బడ్జెట్తో సమానంగా ఉంది. ఇప్పుటికే విదేశీ మారక ద్రవ్యం లేక పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఐఎంఎఫ్ ఇచ్చే సహాయ ప్యాకేజీపైనే ఆధారపడుతోంది. యుద్ధమంటూ మొదలైతే ఆ ఖర్చు భారీగా ఉంటుంది. దాన్ని భరించే స్థితిలో పాకిస్తాన్ లేదు.
మరోవైపు అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగుతున్నా, భారత్ వద్ద అంతకంటే బలమైన అణ్వాస్త్రాలు ఉన్నాయనే సంగతి ఆ దేశం గుర్తుంచుకోవాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ ప్రతీకార దాడులు చేస్తే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ కనిపించదని వారంటున్నారు.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం