భారత్‌లో 15 శాతం తగ్గిన బంగారం డిమాండ్‌

భారత్‌లో 15 శాతం తగ్గిన బంగారం డిమాండ్‌
జనవరి- మార్చి త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్‌ 15 శాతం తగ్గి 118.1 టన్నులకు చేరింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ కాలంలో మొత్తం పెట్టుబడి విలువ 22 శాతం పెరిగి రూ.94,030 కోట్లకు చేరుకుంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. కౌన్సిల్‌ తెలిపిన వివరాల ప్రకారం 2025లో భారత్‌లో బంగారం డిమాండ్‌ 700-800 టన్నుల మధ్య ఉంటుందని అంచనా. 
 
అయితే, ఈ ఏడాది జనవరి నుంచి బంగారం ధరలు 25 శాతం పెరిగాయి. ఒక దశలో తులం బంగారం రూ.లక్ష వరకు చేరింది. ధరల పెరుగుదల మార్కెట్‌లో వినియోగదారులను భారీగా ప్రభావితం చేసింది. భారీగా పెరిగిన ధరల కారణంగా కొనుగోలు సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ బంగారం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇది కొనుగోలు సెంటిమెంట్‌కు సహాయపడుతుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సచిన్‌ జైన్‌ త్రైమాసిక నివేదికలో పేర్కొన్నారు.

అక్షయ తృతీయ సందర్భంగా మార్కెట్‌లో ఉత్సాహం కనిపించింది. భారత్‌లో అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నది. దాంతో బంగారం కొనుగోళ్లు భారీగానే జరిగాయి. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగ్గా చాలామంది తగ్గుతాయనే ఆశలో పసిడి కొనుగోలును వాయిదా వేస్తూ వస్తున్నారు. 

అయితే, రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారం ధర స్థిరంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత బంగారం ధరల నేపథ్యంలో చాలామంది జాగ్రత్తగా ఉన్నారని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ నేపథ్యంలో అమ్మకాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే, పెట్టుబడుల విషయం డిమాండ్‌ బలంగానే ఉన్నది. 

ఈ కాలంలో 43.6 టన్నుల నుంచి 7శాతం పెరిగి 46.7 టన్నులకు చేరింది. దానికి తోడు మార్కెట్‌లో అనిశ్చితి నేపథ్యంలో బంగారానికి డిమాండ్‌ మరింత పెరిగింది. గోల్డ్‌ బార్స్‌, నాణేలకు డిమాండ్‌ ఉన్నది. 2025 క్యాలెండర్‌ తొలి త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్‌ 25శాతం తగ్గి 71.4 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో 95.5 టన్నులుగా ఉన్నది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం 2020 తర్వాత ఈ ఏడాది డిమాండ్‌ అత్పల్పంగా ఉన్నది.

జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 8 శాతం పెరిగి 167.4 టన్నులకు చేరాయి. అయితే వినియోగదారులు రికార్డు ధరలు ఉన్నప్పటికీ బంగారం రీసైక్లింగ్ 32 శాతం తగ్గి 26 టన్నులకు చేరుకుంది.  ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో పది గ్రాముల బంగారం సగటు త్రైమాసిక ధర రూ.79,633.4 ఉండగా.. 2024 తొలి త్రైమాసికంలో రూ.55,247 పలికింది. మరో వైపు 2025 జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రపంచ బంగారం డిమాండ్ ఒక శాతం పెరిగి 1,206 టన్నులకు చేరుకుంది. 2019 తర్వాత తొలి త్రైమాసికంలో భారీగా డిమాండ్‌ ఉన్నది.