మరోసారి స్మిత అగర్వాల్ ట్వీట్ తో ఇరకాటంలో ప్రభుత్వం!

మరోసారి స్మిత అగర్వాల్ ట్వీట్ తో ఇరకాటంలో ప్రభుత్వం!

సమర్ధతకు మారుపేరుగా పేరొందిన ఐఏఎస్ అధికారిణి  స్మితా సబర్వాల్ ఓ విధంగా రేవంత్ రెడ్డిని తరచూ ఇరకాటంలోకి నెట్టివేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి హోదాలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన పర్యటనలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.

ఇటీవల ప్రభుత్వానికి మింగుడుపడని చర్యలతో కూడా ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఐఏఎస్ అధికారుల తాజా బదిలీల్లో స్మిత సబర్వాల్‌ను పర్యటక శాఖ నుంచి ఆర్థిక శాఖకు బదిలీ చేయడంతో భగవద్గీతలోని శ్లోకాన్ని ట్వీట్ చేయడం ప్రభుత్వ ధోరణి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లయింది. 
 
‘కార్మన్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన’ అంటూ మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. ‘కర్మ చేయడం వరకే నీ విధి. ఆ కర్మఫలానికి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు’ అనే అర్థం వచ్చేలా ఈ శ్లోకాన్ని ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వ చర్యతో స్మితా సబర్వాల్ ఒకింత అసంతృప్తితో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.

“నాలుగు నెలల కాలంలో పర్యాటక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పర్యాటక విధానం 2025-30ను రాష్ట్రానికి పరిచయం చేశాను. నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌లో పెట్టుబడుల కోసం పటిష్టమైన ఫ్రేమ్ క్రియేట్ చేశాను. డిపార్ట్‌మెంట్‌లో జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి గ్లోబల్ ఈవెంట్ కోసం మొదలుపెట్టిన ప్రయత్నం నాకు గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది” అని స్మితా సబర్వాల్ రాసుకొచ్చారు.

ఓ విధంగా సమర్ధవంతంగా పనిచేసినందుకు నాలుగు నెలలకే బదిలీ చేస్తున్నారా? అని ప్రశ్నించినట్లయింది. పిన్న వయస్సులో సివిల్స్ సాధించడమే కాకుండా ట్రైనీ కలెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సమయం నుంచే తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ హోదాల్లో పని చేసి, ప్రశంసలు పొందారు. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శిగా పనిచేసి దేశం దృష్టిని ఆకర్షించారు. 
 
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రమంతా పర్యటించి సమస్యలు పరిష్కారించేవారు, అభివృద్ధి పనుల పర్యవేక్షించేవారు స్మితా సబర్వాల్.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వంలో గడ్డుకాలమే వెల్లదీస్తున్నారు. తాజాగా,  కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐతో సృష్టించిన ఫొటోలను రీట్వీట్ చేసి ఆమె చిక్కుల్లో పడ్డారు. 

దీంతో పోలీసు శాఖ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. చట్టంపై గౌరవంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని చెబుతూనే చట్టం అందరికీ సమానమేనా? ప్రత్యేకంగా ఎంపిక చేసినవారికేనా? తనతో పాటు ఫొటో షేర్ చేసిన రెండు వేల మందికి కూడా నోటీసులు ఇస్తారా? అంటూ పోలీసులను ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిన్నట్లయింది.

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో చేసిన వివాదాస్పద ట్వీట్ల ఎపిసోడ్ అనంతరం ఆమె అంతకు మునుపు పనిచేసిన ఆర్థిక శాఖకు సభ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న వేళ.. అందులోనూ గత కొన్ని రోజులుగా స్మితా సబర్వాల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీబిజీగా గడుపుతున్న వేళ ఆమెను బదిలీ చేయడం అందరికి విస్మయం కలిగించింది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.