
సమర్ధతకు మారుపేరుగా పేరొందిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఓ విధంగా రేవంత్ రెడ్డిని తరచూ ఇరకాటంలోకి నెట్టివేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి హోదాలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్యటనలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.
“నాలుగు నెలల కాలంలో పర్యాటక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పర్యాటక విధానం 2025-30ను రాష్ట్రానికి పరిచయం చేశాను. నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్లో పెట్టుబడుల కోసం పటిష్టమైన ఫ్రేమ్ క్రియేట్ చేశాను. డిపార్ట్మెంట్లో జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి గ్లోబల్ ఈవెంట్ కోసం మొదలుపెట్టిన ప్రయత్నం నాకు గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది” అని స్మితా సబర్వాల్ రాసుకొచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వంలో గడ్డుకాలమే వెల్లదీస్తున్నారు. తాజాగా, కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐతో సృష్టించిన ఫొటోలను రీట్వీట్ చేసి ఆమె చిక్కుల్లో పడ్డారు.
దీంతో పోలీసు శాఖ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. చట్టంపై గౌరవంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని చెబుతూనే చట్టం అందరికీ సమానమేనా? ప్రత్యేకంగా ఎంపిక చేసినవారికేనా? తనతో పాటు ఫొటో షేర్ చేసిన రెండు వేల మందికి కూడా నోటీసులు ఇస్తారా? అంటూ పోలీసులను ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిన్నట్లయింది.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో చేసిన వివాదాస్పద ట్వీట్ల ఎపిసోడ్ అనంతరం ఆమె అంతకు మునుపు పనిచేసిన ఆర్థిక శాఖకు సభ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న వేళ.. అందులోనూ గత కొన్ని రోజులుగా స్మితా సబర్వాల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీబిజీగా గడుపుతున్న వేళ ఆమెను బదిలీ చేయడం అందరికి విస్మయం కలిగించింది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
More Stories
కాళేశ్వరం కమిషన్ బ్లాక్ మెయిల్ కోసమా?
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు