ఆప్ నేతలపై రూ. 2,000 కోట్ల అక్రమాలు జరిపినట్లు కేసు

ఆప్ నేతలపై రూ. 2,000 కోట్ల అక్రమాలు జరిపినట్లు కేసు
ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఆప్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాల నిర్మాణంలో రూ. 2 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు బయటపడింది.  ఇందులో ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి జైన్‌లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 
దీనిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు సిసోడియా, జైన్‌లపై కేసులు బుక్‌ చేశారు. అంతేకాదు ఈ స్కామ్‌లో ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ చీఫ్‌ మధుర్‌ వర్మ తెలిపారు.  ఆప్‌ ప్రభుత్వంలో సిసోడియా విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. సత్యేంద్ర జైన్‌ ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ సమయంలో ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాలను నిర్మించారు. అయితే, వాటిని అధిక వ్యయంతో నిర్మించినట్లు గుర్తించారు. వీటి నిర్మాణంలో రూ.2 వేల కోట్లు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది.  ఈ పనులను 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని, అందులో ఎక్కువ మంది ఆప్‌తో సంబంధాలు కలిగిన కాంట్రాక్టర్లే ఉన్నట్లు తేలింది.

 
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద అనుమతులు మంజూరు కావడంతో దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 12,748 తరగతి గదులు/భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూ.2,892 కోట్లు. ఒక్కో క్లాస్ రూము నిర్మాణానికి రూ.24,86 లక్షల చొప్పున టెండర్లు ఇచ్చారు. గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోగా, భారీగా ఖర్చు చేశారు.  గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించడం వల్ల సుమారు 5 రెట్లు వ్యయం పెరిగింది. 
30 సంవత్సరాలు ఉండేలా తరగతి గదులను కట్టారు. అయితే వాటికి అయిన ఖర్చు మాత్రం 75 ఏళ్లు ఉండేలా అయింది. కాంట్రాక్టులు ఆప్ ఆద్మీ పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నవాళ్లకే దక్కాయి. తరగతి గదుల నిర్మాణం ప్రాజెక్టులో తీవ్రమైన అవకతవకలు జరిగినట్టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గతంలో నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదకపై మూడేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.