పహల్గాం దాడిపై  పాక్ నేతలపై మండిపడుతున్న ఒవైసి

పహల్గాం దాడిపై  పాక్ నేతలపై మండిపడుతున్న ఒవైసి
పహల్గాం ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగా ఖండించడమే కాకుండా, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై మండిపడుతూ, ఈ సందర్భంగా ఆ దేశ నేతలు చేస్తున్న వాఖ్యలపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.  సింధూ నది జలాలను భారత్ అడ్డుకుంటే రక్తం పారుతుందన్న పాకిస్థాన్‌ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీపై మండిపడ్దారు.
పాక్‌ మాజీ ప్రధాని అయిన ఆయన తల్లి బెనజీర్ భుట్టో, ఆ దేశ మాజీ అధ్యక్షుడైన ఆయన తాత జుల్ఫికర్ అలీ భుట్టోను చంపింది ఎవరో గుర్తు చేసుకోవాలని హితవు చెప్పారు. 
“వారు (ఉగ్రవాదులు) మీ అమ్మని కాల్చిచంపితే అది ఉగ్రవాదం. వారు (ఉగ్రవాదులు) మా తల్లులు, కుమార్తెలను చంపినప్పుడు, అది ఉగ్రవాదం కాదా?” అని ఆగ్రహంగా ప్రశ్నించారు.  కాగా, భారత్‌పై బిలావల్ భుట్టో వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటలని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. 
 
“అలాంటి చిన్నపిల్లల మాటలు మర్చిపోండి. తన తాతకు ఏమి జరిగిందో ఆయనకు తెలియదు? ఆయన తల్లిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాబట్టి కనీసం ఆయన ఇలా మాట్లాడకూడదు. మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకైనా తెలుసా? అమెరికా మీకు ఏదైనా ఇస్తే తప్ప దేశాన్ని నడపలేరు. అలాంటి మీరు మమల్ని ఎత్తిచూపేలా మాట్లాడతారు” అని విమర్శించారు.

మరోవైపు అణు బాంబులను గురిపెట్టామన్న పాకిస్థాన్‌ నేతల బెదిరింపులపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఒక దేశంలోకి ప్రవేశించి అమాయకులను చంపితే, ఎంత పవర్‌ ఉన్నప్పటికి ఏ దేశం మౌనంగా ఉండదని స్పష్టం చేశారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారని నిలదీశారు. 

“మీరు మా దేశంపై దాడి చేసిన విధానం, మతం అడిగి కాల్చివేయడం ఖవారిజ్ (ఇస్లాం మతం ఫిరాయింపుదారుల) కంటే హీనంగా ఉన్నారు. మీరు ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులు”అని పాక్‌ నేతలను దుయ్యబట్టారు. పహల్గాం దాడిపై ఘటనపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై సహితం  ఒవైసీ మండిపడ్డారు. అతడో జోకర్‌ అంటూ తీవ్రంగా స్పందించారు. 

ఓ విలేకరి షాహిద్‌ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు ఒవైసీ సమాధానమిస్తూ.. అతనెవరు ? ఇది ఒక డ్రామా. నా ఎదుట జోకర్ల పేర్లను ఎందుకు తీసుకువస్తున్నారంటూ’ వ్యాఖ్యానించారు. దేనికి పనికి రానివాళ్ల గురించి మాట్లాడడం దండగ అంటూ చురకలంటించారు. పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘గ్రే లిస్ట్’లో ఉంచాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో నిర్ణయించుకోవాలని హితవు చెప్పారు. పాకిస్తాన్‌ను మళ్లీ ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లో పెట్టాలన్నది తన డిమాండ్‌ అని, ఇది అవసరమని స్పష్టం చేశారు.