తమిళనాడు మంత్రులు సెంథిల్, పొన్ముడి రాజీనామాలు

తమిళనాడు మంత్రులు సెంథిల్, పొన్ముడి రాజీనామాలు
ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నుండి తమిళనాడు మంత్రులు వి.సెంథిల్ బాలాజీ, కె. పొన్ముడి రాజీనామా చేశారని, గవర్నర్ దానిని ఆమోదించారని రాజ్‌భవన్ ఆదివారం తెలిపింది. వారి రాజీనామాలను ఆమోదించాలని ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించారని రాజ్‌భవన్ ప్రకటన పేర్కొంది. 

పాన్ముడి, సెంథిల్‌ బాలరాజ్‌కు వ్యతిరేకంగా తీవ్ర కేసులు నమోదు కావడంతో, మంత్రిపదవుల్లో కొనసాగడంపై న్యాయస్థానం ఆక్షేపణలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వారు ఇరువురు రాజీనామా చేయాల్సివచ్చింది. సెంథిల్ బాలాజీ ఈడి దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ‘పదవా లేక స్వేచ్ఛా ఏదో ఒకటి ఎంచుకొండి’ అంటూ సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. 

ఒకవేళ మంత్రి పదవి నుంచి దిగిపోకపోతే బెయిల్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక ఒక సెక్స్ వర్కర్ విషయంలో పొన్ముడి చేసిన శైవ వైష్ణవ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది.  దీనిపై మద్రాస్ హైకోర్టు తర్వాత స్వయంగా విచారణ ప్రారంభించింది.  ఆయనను పార్టీ కీలక పదవి నుంచి తొలగించినప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు, ఇతర వర్గాల నుండి ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి.

ఇదివరలో సెంథిల్ బాలాజీ నిర్వహించిన ఎలక్ట్రిసిటీ శాఖను ఇకపై ట్రాన్స్‌పోర్ట్ మంత్రి ఎస్.ఎస్. శివశంకర్ నిర్వహిస్తారు. కాగా సెంథిల్ బాలాజీ నిర్వహించిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖను హౌజింగ్ మినిష్టర్ ఎస్.ముతుస్వామికి అప్పగించారు.  మరోవైపు పొన్ముడి నిర్వహించిన అటవీ శాఖను పాడిపరిశ్రమ మంత్రి ఆర్.ఎస్.రాజకన్నప్పన్‌కు కేటాయించారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే పద్మనాభపురం ఎంఎల్‌ఎ టి.మనో తంగరాజ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన సిఫార్సును కూడా గవర్నర్ రవి ఆమోదించారు.  ఇదివరలో కేబినెట్‌ను పునర్వవస్థీకరించినప్పుడు రాజకన్నప్పన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. కానీ ఇప్పుడు మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు. ఆయన సోమవారం సాయంత్రం 6 గంటలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని రాజ్‌భవన్ తన ప్రకటనలో తెలిపింది.