పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నవారందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రదాడి తనను ఎంతగానో కలచివేసిందని, ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడని పేర్కొన్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని పేర్కొంటూ ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని చెప్పారు. ఆ దాడికి కఠినాతికఠినంగా బదులు తీర్చుకుని తీరుతామని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రతినెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్లో ప్రధాని మోదీ, ఈ మేరకు పహల్గాం ఉగ్రదాడి బాధితులకు భరోసా ఇచ్చారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ, ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారని, ఇదే భారత్లో ఉన్న గొప్పదనమని కీర్తించారు. జమ్ముకశ్మీర్ పురోగతిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాని మండిపడ్డారు. పహల్గాం పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని సహించలేక అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్లో గత కొన్నాళ్లుగా శాంతి, సామరస్యం నెలకొన్నాయని, ఆ పరిస్థితిని చెడగొట్టడానికే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని ప్రధాని ఆరోపించారు. జమ్ముకశ్మీర్ ప్రశాంతంగా ఉండటం ఉగ్రవాదులకు, వాళ్లను పెంచిపోషిస్తున్న వాళ్లకు ఇష్టం లేదని పేర్కొన్నారు. “కాశ్మీర్లో గత కొన్నేళ్ళ నుంచి పాఠశాలలు, కళాశాలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయి” అని ప్రధాని గుర్తు చేశారు.
“తిరిగి శాంతియుత వాతావరణం కనిపించడం మొదలైంది. ఇది చూసి దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులు ఓర్వలేకపోయారు. మళ్లీ అంతా నాశనం చేయాలని పెద్ద కుట్రను అమలు చేశారు. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల నిరాశను, వారి పిరికితనాన్ని చాటుతోంది” అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కశ్మీర్లో తిరిగి శాంతి నెలకొనటం, పాఠశాలలు, కళాశాలల్లో చైతన్యం, నిర్మాణ పనుల్లో వేగం, ప్రజాస్వామ్యం బలోపేతం, పర్యాటకుల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరగటం, ప్రజల ఆదాయం పెరగటం, యువతకు నూతన అవకాశాలు పెరగటం దేశం, జమ్ముకశ్మీర్ శత్రువులకు మింగుడు పడలేదు. ఉగ్రవాదులు, వారిని వెనకుండి నడిపించేవారు కశ్మీర్ మళ్లీ నాశనం కావాలనుకున్నారు. అందుకే ఇంతపెద్ద కుట్ర పన్నారు” అని ప్రధాని ఆరోపించారు.
ఉగ్రవాదంపై పోరాటం, దేశ ప్రజల ఐక్యత, 140కోట్ల మంది ప్రజల సంఘీభావం దేశానికి అతిపెద్ద బలమన్నారని ప్రధాని చెప్పారు. మనలో ఉన్న ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఈ దాడిని భారత ప్రజలు ఒకే గొంతుతో వ్యతిరేకించడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిన సమయం వచ్చిందని మోదీ వెల్లడించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని బయటకు లాగుతామని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవారి వెన్ను విరుస్తామని హెచ్చరించారు.
“మిత్రులారా, ఈ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రపంచం నలుమూలల నుంచి నిరంతరం సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు. లేఖలు రాశారు. సందేశాలు కూడా పంపారు. ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు వారు సంతాపం తెలిపారు” అని తెలిపారు. “ఉగ్రవాదంపై మన పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు ప్రపంచం అండగా నిలుస్తోంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను మరోసారి హామీ ఇస్తున్నాను. ఈ దాడికి పాల్పడిన వారిపైనా, కుట్రదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటాం” అని ప్రధాని భరోసా ఇచ్చారు.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం