
* అంతర్జాతీయ రూట్లలో 12 శాతం ఛార్జిల పెంపు
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో దాయాది దేశం సైతం విమానాలకు గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో విమానయాన రంగంతో పాటు ఉత్తర భారతం నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. యూరప్, అమెరికా, మిడిల్ఈస్ట్ తదితర దేశాలకు పాక్ గగనతలంపై నుంచి భారత విమాన సర్వీసులు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో చుట్టూ తిరిగి ప్రయాణించడంతో వ్యయాలు పెరిగాయి.
ఆయా భారాన్ని ప్రయాణికులపై మోపాలని విమాన సంస్థలు నిర్ణయించాయి. దాదాపు 8 శాతం నుంచి 12 శాతం వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి ఉత్తర అమెరికా, బ్రిటన్, యూరప్ తదితర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల సమయం మరింత పెరిగిందని ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి సంస్థలు తమ ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నాయి.
అమెరికా, యూరోపియన్ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణ సమయం 2 గంటల నుంచి 2.5 గంటల వరకు పెరగిందని ఓ పైలట్ తెలిపారు. దీంతో చమురు, నిర్వహణ వ్యయం పెరగడంతో విమాన ఛార్జీలను పెంచాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయన్నారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచ్చించడంతో పాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోందని విమానయాన సంస్థల వర్గాలు పేర్కొన్నాయి.
ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. ఇది కూడా ప్రయాణిలపై భారం పెంచనుంది. కాగా భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత విమానాలపై పాక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విమానయాన సంస్థలకు పలు సూచనలు జారీ చేసింది.
అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ప్రయాణ సమయం పెరగనున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు పలు అడ్వైజరీలు జారీ చేసింది. విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలని సూచించింది. పాక్ గగనతలం అందుబాటులో లేకపోవడంతో విమానాలను ప్రత్యామ్నాయ, సుధీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని, దాంతో ప్రయాణ సమయం పెరుగుతుందని, ఇంధనం నింపుకునేందుకు, సిబ్బందిని సైతం మార్చేందుకు టెక్నికల్ స్టాప్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చని హెచ్చరించింది.
ఈ సమయాల్లో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని, సుదీర్ఘ ప్రయాణ సమయానికి అనుగుణంగా ఆయా విమానాల్లో అదనంగా ఆహారం, డింక్స్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. అత్యవసర వైద్య సదుపాయాలు ఉండేలా చూసుకోవడంతో పాటు సిబ్బంది అప్రమత్తతపై దృష్టి పెట్టాలని చెప్పింది. ఢిల్లీ, అమృత్నగర్ తదితర ఉత్తరాది నగరాల నుంచి యూఏఈ, యూరప్, యూకే, ఉత్తర అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఆయా విమానాలు ఇకపై ముంబయి, అహ్మదాబాద్ ల మీదుగా అరేబియా సముద్రం మీద నుంచి మస్కట్ వైపు మళ్లాల్సి ఉంటుంది.ఈ మార్గంలో ఎదురు గాలులు వీస్తాయని, దాంతో ప్రయాణ సమయంలో మరింత పెరుగుతుందని పైలెట్లు పేర్కొంటున్నారు. సుదూర ప్రాంతాలకు సర్వీసులు నడిపే ఎయిర్ ఇండియాపై అదనంగా భారం పడే అవకాశాలున్నాయి.
ప్రయాణ సమయం, దూరం పెరిగిన నేపథ్యంలో పలు అంతర్జాతీయ సర్వీసులను ఇండిగో తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా బుక్ చేసే టికెట్లపై 30 నుంచి 40శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
More Stories
భారత్, అమెరికా జులై 8లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం!
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు