పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి

పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న వారిని ఇలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ఈ మేరకు 15 దేశాలతో ఉన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శనివారం ఉదయం ప్రకటన విడుదల చేసింది. కౌన్సిల్​లోని సభ్యులు ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని ప్రకటన ద్వారా తీవ్రంగా ఖండించారు.

బాధితుల కుటుంబాలకు, భారత ప్రభుత్వానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు భద్రతా మండలి సభ్యులు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని భద్రతా మండలి సభ్యులు తెలిపారు. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవిగా తెలిపారు. అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. అదే సమయంలో చురుగ్గా వ్యవహరించాలని కోరారు.

మరోవైపు, పహల్గాంలో జరిగిన అమానుష ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యటకులు మృతి చెందడం అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. పౌరులపై జరిగిన ఈ దాడి మానవతా విలువలను తుంచేస్తుందని ఐరాస స్పష్టం చేసింది. ఈ విషయంపై ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాతో ఇటీవల మాట్లాడారు.