ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష
పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి భారత్ హతమారుస్తుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు గురువారం బిహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు.  తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

“పెహల్‌గామ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు. దేశంపై జరిగిన దాడి. ఈ దాడిని భారత్‌ ఎన్నటికీ క్షమించదు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు. కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తాం. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ వేటాడి శిక్షిస్తాం” అంటూ ప్రధాని హెచ్చరించారు.  “ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజలకు మాటిస్తున్నా.. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రనేతలను కూడా విడిచిపెట్టం. ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతోంది” అని స్పష్టం చేశారు.

ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని పేర్కొన్నారు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. 

‘‘వారు భారత్ ఆత్మపై దాడి చేసే దుస్సాహసం చేశారు. ప్రపంచానికి మేము చెప్పేది ఒక్కటే.. ఉగ్రవాదులను, వారికి సాయమందించిన వారందరికీ గుర్తించి శిక్షిస్తాము. భూమి అంచుల వరకూ వారిని వెంటాడి పట్టుకుంటాము. ఉగ్రవాదంతో భారత్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు’’ అని మోదీ నిప్పులు చెరిగారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు. అదే సమయంలో భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తమకు అండగా నిలిచారని చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరని మోదీ స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో యావత్ దేశం ఏకమైందని స్పష్టం చేశారు.