
ఈ మేరకు గురువారం బిహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
“పెహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు. దేశంపై జరిగిన దాడి. ఈ దాడిని భారత్ ఎన్నటికీ క్షమించదు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు. కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తాం. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ వేటాడి శిక్షిస్తాం” అంటూ ప్రధాని హెచ్చరించారు. “ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజలకు మాటిస్తున్నా.. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రనేతలను కూడా విడిచిపెట్టం. ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతోంది” అని స్పష్టం చేశారు.
ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని పేర్కొన్నారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం