చైనాపై సుంకాలను తగ్గిస్తామన్న ట్రంప్‌

చైనాపై సుంకాలను తగ్గిస్తామన్న ట్రంప్‌
ప్రపంచ దేశాలపై ఏకదాటిగా టారిఫ్‌లను పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్రమంగా దిగివస్తున్నారు. చైనాపై వేసిన టారిఫ్‌లను వెనక్కి తీసుకోనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. చైనా ఉత్పత్తులపై 145 శాతం సుంకాలను అమలు చేస్తున్నారు. వీటిని 245 శాతానికి పెంచుతున్నట్లు ఓ దశలో హెచ్చరించారు. 

దీనిపై చైనా ధీటుగా బదులివ్వడంతో రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమైంది. ట్రంప్‌ చర్యలపై అమెరికాలోనూ తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టారిఫ్‌లపై తాజాగా ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాలను భారీగా తగ్గిస్తామని చెప్పారు. అలాగని సున్నా మాత్రం కావని పేర్కొన్నారు.

భవిష్యత్తులో చైనాతో జరగనున్న చర్చల్లో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తామని ట్రంప్‌ తెలిపారు. ఇందుకోసం బీజింగ్‌ తమతో ఓ అంగీకారానికి రావాల్సి ఉందని, ఒప్పందం జరగాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం తాము చైనాతో జరుపుతున్న వాణిజ్య చర్చలు సజావుగానే జరుగుతున్నాయని వెల్లడించారు.  ఎందుకంటే ప్రతీ దేశం అమెరికా మార్కెట్‌లో ఉండాలని కోరుకుంటుందని చెప్పారు. చైనాతో తాము ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఎదురు చూస్తున్నామని తెలిపారు. చైనాపై విధించిన సుంకాల్లో తగ్గింపులు ఉండొచ్చని ట్రంప్‌ వ్యాఖ్యలకు ముందే ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ సంకేతాలు ఇచ్చారు.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ అంశంలో ట్రంప్‌ సానుకూల ప్రకటన చేశారు. ఈ వారంలోనే రష్యా, ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందానికి వస్తాయని ట్రంప్‌ తెలిపారు. దీంతో యుద్ధం ఆగిపోనుందన్నారు. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సానుకూలంగా స్పందించారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్‌ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి.