ఉగ్రదాడిపై భగ్గుమన్న భారతావని

ఉగ్రదాడిపై భగ్గుమన్న భారతావని

* ఉగ్రదాడికి నిరసనగా కాశ్మీర్ లోయలో 35 ఏళ్లలో తొలిసారి బంద్

జమ్ముకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం భగ్గుమంది. పర్యటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సహా దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారు. ముష్కరుల దాడికి నిరసనగా శ్రీనగర్, డోగ్రా, కంగన్ సహా జమ్ముకశ్మీర్లో పలు ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేశారు.

పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా బుధవారం బంద్‌ పాటించారు. దీంతో కాశ్మీర్‌ లోయలో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్‌ బంకులు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. కాగా కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ప్రజా జీవనం స్తంభించిపోవడం గత 35 ఏళ్ళలో ఇదే మొదటిసారి. కాశ్మీర్‌ వాణిజ్య పరిశ్రమల మండలి (కేసీసీఐ), కాశ్మీర్‌ వ్యాపారులు-ఉత్పత్తిదారుల సమాఖ్య (కేటీఎంఎఫ్‌), మత సంస్థ ముత్తాహిదా మజ్లిస్‌ ఉలేమా (ఎంఎంయూ), జమ్మూకాశ్మీర్‌కు చెందిన గ్రాండ్‌ ముఫ్తి నసీరుల్‌ ఇస్లాం సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి.

జమ్మూ ప్రాంతంలో కూడా బంద్‌కు పూర్తి మద్దతు లభించింది. జమ్మూ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ, జమ్మూ బార్‌ అసోసియేషన్‌ పూర్తి బంద్‌కు పిలుపునిచ్చాయి. జమ్మూ నగరంలోనూ, ఇతర ప్రధాన ప్రాంతాలలోనూ బంద్‌ దృశ్యాలు కన్పించాయి. బంద్‌కు రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు తెలిపారు. బాధితులకు సంఘీభావం ప్రకటించారు. పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడి మృతులకు సంతాపంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఒక నిమిషం మౌనం పాటించారు. ఉగ్రవాద చర్యను ఖండిస్తూ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

“ఈ బుద్ధిహీన హింసాత్మక చర్య అందరి మనస్సాక్షిని కదిలించింది. ఈ దాడి ఉగ్రవాద క్రూరత్వం, అమానవీయతను పూర్తిగా గుర్తు చేస్తుంది. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సుప్రీంకోర్టు గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తోంది. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.” అని సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేసింది.

పహల్గాంలో ఉగ్రదాడితో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.  ఈ సందర్భంగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాజా సంఘటనతో కశ్మీరీలు సిగ్గుతో తలదించుకుంటున్నారని పేర్కొన్నారు.  అటు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా లాల్‌చౌక్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టింది. 

రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఉగ్రచర్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనగర్ సహా అనేక చోట్ల బంద్ పాటించారు. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీశారని ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో నిరసనలు చేపట్టారు. ఉగ్రచర్యకు వ్యతిరేకంగా దక్షిణ కశ్మీర్ లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. 2016లో హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ హతమైన తరువాత ఇదే విధంగా స్థానికులు వీధుల్లోకి వచ్చారు. 

కశ్మీరీలు ఉగ్రవాదంతో లేరనే సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే ఈ నిరసనలు చేస్తున్నామని , పర్యాటకులపై దాడిని ఖండిస్తున్నామని స్థానిక సామాజిక కార్యకర్త తౌసీఫ్ అహ్మద్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు జమ్ముకశ్మీర్ ప్రజల మేలు కోరే వారు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహ్‌దీ పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.

 రాంబన్ జిల్లాలోనూ నిరసనలు జరిగాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన సంఘటనలతో విలవిల్లాడుతున్నప్పటికీ ఉగ్రదాడికి నిరసనగా బంద్ పాటించి శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. ఈ పట్టణ చరిత్రలో తొలిసారిగా హిందూ, ముస్లిం వర్గాలు కలిపి ఉగ్రచర్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. శ్రీనగర్లోని లాల్ చౌక్లో కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు ఆందోళనబాట పట్టారు.

ఈ దాడిని తమిళనాడు అసెంబ్లీ ఖండించింది. మృతులకు సంతాపం ప్రకటిస్తూ నిమిషం మౌనం పాటించారు సభ్యులు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిని ఇశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ ఖండించారు. దీన్ని భయంతో సమాజాన్ని కుంగదీసే ఉద్దేశంగా అభివర్ణించారు. ఈ దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

 “ఉగ్రవాదం ముఖ్య ఉద్దేశ్యం యుద్ధం కాదు. భయంతో సమాజాన్ని కుంగదీయడం, భయాందోళనలను వ్యాప్తి చేయడం, సమాజాన్ని విభజించడం, దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతియ్యడమే. ” అని సద్గురు పేర్కొన్నారు.