పాకిస్తాన్ నటుడి సినిమాపై కేంద్రం నిషేధం

పాకిస్తాన్ నటుడి సినిమాపై కేంద్రం నిషేధం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నటుడు ఫవాద్‌ ఖాన్‌ నటించిన ‘అబీర్‌ గులాల్‌’ చిత్రంపై నిషేధం విధించింది. దేశంలో ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.  పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల‌ తర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌లో ప్రవేశింపబోతున్న సమయంలో ఈ ఉగ్రదాడి జరగడంతో ఈ నిషేధంకు దారితీసింది. 

బాలీవుడ్ న‌టి వాణీకపూర్‌, పాకిస్థాన్ న‌టుడు ఫవాద్‌ ఖాన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ‘అబీర్‌ గులాల్‌’. ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా ఇందులో పాకిస్థాన్ న‌టుడు ఫ‌వాద్ ఖాన్ హీరోగా న‌టిస్తుండ‌డంతో మూవీని కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించింది. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంతో ఆర్తి ఎస్‌ బగ్దీ ఈ సినిమాను తెరకెక్కించారు.  ఇటీవల ఈ మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేశారు. తాజాగా వాటిని కూడా యూట్యూబ్‌ (ఇండియా) నుంచి తొలగించారు.

అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్‌ స్పందించలేదు. పాకిస్థాన్‌ నటుడి సినిమా కావడంవల్ల ఈ మూవీ ప్రకటన వెలువడిన నాటి నుంచే బాయ్‌కాట్‌ చేయాలంటూ కొందురు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  తాజాగా జరిగిన ఉగ్ర దాడితో ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. అంతేకాకుండా ఈ సినిమాను ప్రోత్సహిస్తున్నందుకు బాలీవుడ్‌ పైన కూడా విమర్శలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ఫవాద్‌ ఖాన్‌ ఇన్​స్టాగ్రామ్ వేదికగా బుధవారం విచారణ వ్యక్తం చేశారు. 

“పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి తెలిసి చాలా బాధపడ్డా. ఈ భయంకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా. ఇలాంటి క్లిష్టమైన సమయంలో వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా” అని పోస్ట్ చేశారు.  కాగా, ఉగ్రదాడిపై స్పందించకుండా, అదే రోజు సోషల్‌ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్‌ చేశారంటూ వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పోస్ట్​ను డిలీట్​ చేశారు. అలాగే దాడిపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

పాకిస్థాన్​కు సంబంధించిన నటీనటులు ఎవ్వరూ భారతీయ చిత్రాల్లో నటించకుండా ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సినీ కార్మికులు సంఘం(ఎఫ్​డబ్యూఐసీఈ) తెలిపింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో వాళ్లని పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటిచింది. అయితే పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఈ సంఘం ఇలాంటి నిషేధాన్ని అమలు చేసింది. ఒక వేళ ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ సినిమా పరిశ్రమలో పాకిస్తాన్ వాళ్లతో కలిసి పని చేసే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.