కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందన్న ప్రచారం నేపథ్యంలో వివరాలు కోరుతూ యూకే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు సోమవారం తెలియజేసింది. బ్రిటిష్ పౌరసత్వం ఉందని, ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ రాజీవ్ సింగ్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం గురించి వివరాలు కోరుతూ యూకే ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందని, అందువల్ల నివేదికను సమర్పించడానికి మరింత సమయం అవసరమని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన పత్రాలను మే 5 వరకు సమర్పించాలని కేంద్రానికి హైకోర్టు సమయం ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ అంశంపై సమయం కావాలని హైకోర్టును కోరింది. గతేడాది నవంబర్ 25న పిల్ విచారించిన సమయంలో కేంద్రం నుంచి హైకోర్టు సమాచారన్ని కోరింది. ఆ సమయంలో వివరాలను సేకరించేందుకు సమయం కావాలని అడిగింది. ఇప్పుడు రెండోసారి కేంద్రం సమయాన్ని కోరడం గమనార్హం.
రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని నిరూపించే పత్రాలు, బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన కొన్ని ఈమెయిల్లు తన వద్ద ఉన్నాయని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నారు. ఆయన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని, ఆయన లోక్సభ సభ్యతాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై తాను రెండు ఫిర్యాదులు పంపానని, కానీ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

More Stories
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, ప్రశ్నలు అడగడం అవసరం
దేశాభివృద్దికోసం ‘దిమాగీ నక్సల్స్’ను ఏకాకి చేయాలి
ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలి