యుద్ధ రహస్యాలు ఇంట్లో లీక్ చేసిన అమెరికా రక్షణ మంత్రి!

యుద్ధ రహస్యాలు ఇంట్లో లీక్ చేసిన అమెరికా రక్షణ మంత్రి!
అమెరికాకు చెందిన కీలక రక్షణ రహస్యాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల యెమెన్‌పై చేపట్టిన భీకర దాడులకు ముందే దీనికి సంబంధించిన ప్రణాళిక బహిర్గతం అయినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ దాడులకు సంబంధించిన రహస్యాలను స్వయంగా అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ తన కుటుంబసభ్యులతో కూడా పంచుకున్నారట.
తన ఫ్యామిలీ గ్రూప్‌చాట్‌లో దీని గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఈ ఏడాది మార్చి 15న యెమెన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దాడులను ప్రకటించారు. అయితే, అంతకంటే ముందే సిగ్నల్‌లోని ఓ గ్రూప్‌చాట్‌ ద్వారా ఈ యుద్ధ ప్రణాళిక బయటికి వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అదే సమయంలో రక్షణ మంత్రి హెగ్సెత్‌ కూడా రెండో సిగ్నల్‌ చాట్‌ను ఉపయోగించి ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులు చెప్పినట్లు ఈ కథనం ప్రచురించింది. 

తన భార్య జెన్సిఫర్‌, సోదరుడు ఫిల్‌ హెగ్సెత్‌తో ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు వెల్లడించింది. హెగ్సెత్‌ భార్య ఫాక్స్‌ న్యూస్‌లో మాజీ ప్రొడ్యూసర్‌ కాగా, ఇక సోదరుడు హోంల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. అంతకుముందు హెగ్సెత్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇతర ముఖ్య అధికారులు ఉన్న సిగ్నల్‌ గ్రూప్‌ చాట్‌ నుంచి ఈ యుద్ధ ప్రణాళికలు బహిర్గతమయ్యాయి. 

ఈ చాట్‌లో ‘ద అట్లాంటిక్‌ మ్యాగజైన్’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ కూడా ఉన్నారు. యెమెన్‌పై దాడుల గురించి చర్చించడానికి రెండు రోజుల ముందే తనను ఆ గ్రూప్‌లో చేర్చాలని జెఫ్రీ కోరారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ కూడా ధ్రువీకరించింది. ఈ లీక్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హెగ్సెత్‌, ట్రంప్‌ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ మరో కథనం వెలువడటం మరింత ఆందోళనకరంగా మారింది. 

దీంతో రక్షణ మంత్రిని తొలగించాలని ప్రతిపక్ష డెమోక్రాట్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, తాజా కథనాలపై పెంటగాన్‌, వైట్‌హౌస్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. హెగ్సెత్‌పై గతంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. రక్షణ శాఖకు సంబంధించిన అధికారిక, రహస్య సమావేశాలకు భార్య, సోదరుడిని వెంటబెట్టుకునే వెళ్లేవారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ అధికారి వర్గీకరించని సందేశ వ్యవస్థపై ఆధారపడటం ఈ సందర్భంగా మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ సృష్టించిన సిగ్నల్ గ్రూప్ చాట్ ను గత నెలలో అట్లాంటిక్‌కు చెందిన జెఫ్రీ గోల్డ్‌బర్గ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  అత్యంత సీనియర్ జాతీయ భద్రతా అధికారులందరినీ కలిగి ఉన్న గ్రూపులో అనుకోకుండా చేర్చాడు. 

మరోవైపు, యెమెన్‌ రాజధాని సనాలో సోమవారం తెల్లవారుజామున అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. ఇందులో కనీసం 12 మంది మరణించగా, మరో 30 మంది గాయపడినట్లు హూతీ రెబల్స్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.