కాంగ్రెస్ నిధులతోనే దారుస్సలాంలో వక్ఫ్ సభ!

కాంగ్రెస్ నిధులతోనే దారుస్సలాంలో వక్ఫ్ సభ!
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి మీటింగ్లో పాల్గొని బీజేపీపై విషం చిమ్ముతున్నారని పేర్కొంటూ మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని పెద్దపల్లిలో మీడియా సమావేశంలో హెచ్చరించారు.

ముస్లిం ఓట్లను దండుకుని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటున్నార‌ని ఆయన మండిపడ్డారు.  అది కాంగ్రెస్ సౌజ‌న్యంతో జ‌రిగిన స‌మావేశందారుస్సలాంలో శ‌నివారం మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ సౌజ‌న్యంతోనే జ‌రిగింద‌ని స్పష్టం చేశారు. 

దేశంలో ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయని, వీటి విలువ రూ. 10 లక్షల కోట్లకు పైమాటే అని, వీటిని సగానికిపైగా వక్ఫ్ బోర్డు ముసుగులో కొల్లగొట్టార‌ని సంజ‌య్‌ కుమార్ ఆరోపించారు. ఒక్క తమిళనాడులోనే రూ.2 వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్నారని, తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ లాండ్స్ ఉంటే అందులో 80 శాతం భూములు ఈ దొంగలే స్వాధీనం చేసుకున్నారని ధ్వజమెత్తారు. 

ఒవైసీ కుటుంబంతో పాటు మజ్లిస్ నాయకులు, సోకాల్డ్ వక్ఫ్ బోర్డు సభ్యులంతా వక్ఫ్ ఆస్తులను దోచుకుని ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు నిర్మించి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది నిజం కాదా? అని ప్ర‌శ్నించారు. ఈ 77వేల ఎకరాల్లో ఒక్క గజం అయినా పేద ముస్లీంలకు ఇవ్వ‌లేద‌ని తెలిపారు.  వక్ఫ్ ఆస్తులపై వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి అయినా పేద ముస్లింలకు ఖర్చు చేయడం లేదని ధ్వజమెత్తారు. రూ. 5 లక్షల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల్లో పేద ముస్లింలకు కేటాయించిందెంత అని, ఆ ఆస్తులపై వచ్చే ఆదాయంలో వాళ్ల కోసం ఖర్చు చేసిందెంత లెక్కలు చెప్పాలని నిల‌దీశారు.

హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తులపై విచారణ జరిపించే దమ్ముందా అని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులంతా అల్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని  ప్రశ్నించారు. అకాల వ‌ర్షాలు కార‌ణంగా న‌ష్ట‌పోయిన‌ రైతులను ఆదుకోవాలని మంత్రులకైనా ఆదేశాలివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.