ఉప్ప‌ల్ స్టేడియంలో పెవిలియ‌న్ కు అజారుద్దీన్‌ పేరు తొల‌గింపు

ఉప్ప‌ల్ స్టేడియంలో పెవిలియ‌న్ కు అజారుద్దీన్‌ పేరు తొల‌గింపు

భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌ కు పెద్ద షాక్. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలోని ‘నార్త్ పెవిలియ‌న్‌’ కు పెట్టిన అత‌డి పేరును తొల‌గించనున్నారు.  అజారుద్దీన్‌పై 2019లో న‌మోదైన కేసును విచారిస్తున్న‌ సుప్రీంకోర్టు విశ్రాంత నాయ్య‌మూర్తి వి. ఈశ్వ‌ర‌య్య నార్త్ స్టాండ్‌ను ‘అజారుద్దీన్ పెవిలియ‌న్‌’గా పిల‌వ‌కూడ‌ద‌ని శ‌నివారం హెచ్‌సీఏను ఆదేశించారు. 

దాంతో, ఆ స్టాండ్‌ను ఇక‌పై అజారుద్దీన్ పేరుతో పిల‌వ‌కూడద‌ని హెచ్‌సీఏ ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌నుంది.  టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఆజారుద్దీన్ 2019లో హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా సేవ‌లందించాడు. ఆ స‌మ‌యంలోనే అత‌డు ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకున్నాడనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  అంతేకాదు ఎవ‌రిని సంప్ర‌దించ‌కుండానే నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ త‌న పేరు పెట్టుకున్నాడు. 

అప్ప‌టికే ఆ స్టాండ్‌ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పేరుతో ఉంది. దాంతో, ఈ విష‌యాన్ని తీవ్ర త‌ప్పిదంగా ప‌రిగ‌ణించిన‌ అంబుడ్స్‌మ‌న్ నార్త్ స్టాండ్‌కు ఇక‌పై అజారుద్దీన్ పెవిలియ‌న్‌గా పిల‌కూడ‌ద‌ని హెచ్‌సీఏకు స్ప‌ష్టం చేసింది.  అంతేకాదు ఇక‌పై మ్యాచ్ టికెట్ల మీద కూడా అజారుద్దీన్ పేరు ఉండ‌కూడ‌ద‌ని తెలిపింది. దాంతో.. అంబుడ్స్‌మ‌న్ ఆదేశాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌నుంది.

కాగా, ఈమ‌ధ్యే హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు యాజ‌మాన్యం మ‌ధ్య కాంప్లిమెంట‌రీ పాస్‌ల‌ వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని హైద‌రాబాద్ ఫ్రాంచైజీ ఏకంగా బీసీసీఐకి లేఖ రాసింది. అయితే ఇరుప‌క్షాలు స‌మావేశ‌మై ఒప్పందం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఇంత‌కుముందు మాదిరిగానే హెచ్‌సీఏకు 3,900 కాంప్లిమెంట‌రీ పాస్‌ల‌ను స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు కేటాయించ‌నుంది.