స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌లకు సుంకాల నుంచి మినహాయింపు

స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌లకు సుంకాల నుంచి మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్‌ పరిపాలన ప్రకటించింది. స్మార్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌, చిప్స్‌కు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సాధారణ వినియోగదారులకు సైతం ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నది.
 
ట్రంప్‌ పరిపాలన సుంకాలను యథావిధిగా అమలు చేస్తే ఆయా వస్తువల ధరలను పెరిగే అవకాశం ఉండేది. ప్రస్తుతం అవే ధరలు కొనసాగే అవకాశం ఉన్నది. యుఎస్ కస్టమ్స్ అండ్‌ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. అనేక వస్తువలకు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది.  ఇందులో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, సెమీ కండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ మిషన్స్‌, ప్లాట్‌ ప్యానెల్‌ మానిటర్స్‌తో పాటు పలు వస్తువులకు మినహాయింపు ఇచ్చింది.
ఈ నిర్ణయంతో ఆపిల్‌, శామ్‌సంగ్‌ వంటి బడా టెక్‌ కంపెనీలకు ఎంతో ఊరట కలుగనున్నది.  ఎందుకు కంటే ఆయా కంపెనీల ఉత్పత్తులు చాలా వరకు అమెరికాలో తయారయ్యే అవకాశం లేదు. ఇతర దేశాల నుంచి మాత్రమే ఆయా కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి. ఆయా ఉత్పత్తులకు అమెరికాలో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. కానీ, అవి ఎక్కువ చైనా, కొరియా, వియత్నాం తదితర దేశాల్లో ఉత్పత్తి అవుతుంటాయి. 
 
వాటిపై భారీ పన్నులు విధించినట్లయితే, కంపెనీలు నష్టపోయే అవకాశం ఉండడంతో పాటు వినియోగదారులపై సైతం అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్‌ సర్కారు వాటిని సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.