
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ డీఫ్యాక్టో సీఎంలా వ్యవహరించడం శోచనీయమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆమె ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఇక డమ్మీ సీఎం అనేది స్పష్టమైపోయిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా పగ్గాలను రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. కానీ ఆమె మాట తప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా సచివాలయానికి రావడం వెనుక రాహుల్ గాంధీ ఆదేశాలున్నాయని తేలిపోయిందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో ఉండగా మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి రివ్యూ చేయడాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఒట్టి కోరలు లేని పాము అని అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ తమ విధానమంటున్న కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగ పరిరక్షణ తమ ధ్యేయమని కార్యక్రమాలను నిర్వహిస్తూ, పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ పరిరక్షణ విధానం ఓ నినాదం గానే మిగిలిపోయిందని ధ్వజమెత్తారు.
అది ఆచరణలో శూన్యమని మీనాక్షి నటరాజ్ నిరూపించారని మండిపడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జులుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వయలార్ రవి వంటి నేతలు ఏనాడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. గతంలో ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రాజీవ్ గాంధీ అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నఅంజయ్యను ఎయిరుపోర్టులో అవమానించారని ఈ సందర్భంగా చెప్పారు.
తండ్రి రాజీవ్ గాంధీ బాటలోనే కుమారుడు రాహుల్ గాంధీ నడుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్కారును రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాలనుకుంటున్నారని విమర్శించారు. ఇపుడు డమ్మీ సీఎంగా మిగిలిపోయిన రేవంత్ రెడ్డి త్వరలోనే మాజీ సీఎంగా మారతాడని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుందని ఏలేటి జోస్యం చెప్పారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుందన్నారని పేర్కొంటూ ఇదేనా మార్పు, రిమోట్ కంట్రోల్ పాలనేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.
More Stories
హెచ్సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్