ద‌క్షిణ‌కొరియా దేశాధ్య‌క్షుడిని ప‌ద‌వి నుంచి తొలగింపు

ద‌క్షిణ‌కొరియా దేశాధ్య‌క్షుడిని ప‌ద‌వి నుంచి  తొలగింపు

అభిశంస‌న‌కు గురైన ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌ను తొల‌గిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో దేశంలో మార్షియ‌ల్ చ‌ట్టాన్ని ప్ర‌యోగించిన నేప‌థ్యంలో అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై పార్ల‌మెంట్‌లో అభిశంస‌న జ‌రిగింది. అయితే అభిశంస‌న‌లో ఓడిన ప్రెసిడెంట్ యూన్‌ను ఆఫీసు నుంచి త‌ప్పిస్తూ శుక్రవారం రాజ్యాంగ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మ‌రో 60 రోజుల్లో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాజ్యాంగ కోర్టు తాత్కాలిక చీఫ్ మూన్ యుంగ్ బే ఇచ్చిన ఆదేశాల‌ను జాతీయ టీవీల్లో ప్ర‌సారం చేశారు. దీంతో ప్ర‌జ‌లు సంబ‌రాల్లో తేలారు. యూన్‌పై అభిశంస‌న‌ను 8 మంది స‌భ్యులున్న రాజ్యాంగ కోర్టు బెంచ్ స‌మ‌ర్థించింది. మాజీ దేశాధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మార్షియ‌ల్ చ‌ట్టాన్ని విధించిన‌ట్లు మూన్ తెలిపారు.

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్ ను జైల్లో వేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న గ‌త నెల‌లో జైలు నుంచి విడుదలయ్యారు. దేశ రాజధాని సియోల్‌లోని న్యాయస్థానం ఆయన అరెస్టును రద్దు చేసిన నేపథ్యంలో యూన్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. గత డిసెంబరులో స్వల్పకాలం పాటు సైనిక పాలన విధిస్తూ యూన్‌ వెలువరించిన ఆదేశాలు దక్షిణ కొరియాలో పెను సంక్షోభాన్ని సృష్టించింది.