కంచ గ‌చ్చిబౌలిలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు నిలిపివేయాలి

కంచ గ‌చ్చిబౌలిలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు నిలిపివేయాలి
కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో  తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలను   నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మ‌ధ్యంత‌ర నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ప్ర‌తివాదిగా కోర్టు చేర్చింది. అత్య‌వ‌స‌రంగా కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏంట‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. 
 
చ‌ట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటార‌ని జ‌స్టిస్ గ‌వాయ్ ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌శ్న‌ల‌కు సీఎస్ స‌మాధానం చెప్పాల‌ని కోర్టు ఆదేశించింది. ఇది చాలా తీవ్ర‌మైన అంశం అని జ‌స్టిస్ గ‌వాయ్ ధర్మాస‌నం పేర్కొంది. అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 16న త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్ట‌నుంది సుప్రీంకోర్టు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగిన సంగ‌తి తెలిసిందే. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించిన కోర్టు అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది.

 హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు కోర్టు కేసును వాయిదా వేసింది. తొలుత ఉదయం ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు హెచ్​సీయూ రిజిస్ట్రార్​కు  కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు రిపోర్ట్​ను అందజేయాలని సూచించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదికను అందజేయాలని హెచ్​సీయూ రిజిస్ట్రార్​కు స్పష్టం చేసింది.

30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అటవీ భూమి (ఫారెస్ట్​ ల్యాండ్​) అని ఆధారాలు లేవని న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

హైదరాబాద్​ కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్​, హెచ్​సీయూ విద్యార్థులు దాఖలు చేసిన పిల్​( ప్రజా ప్రయోజన వ్యాజ్యం)పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైదరాబాద్​ సెంట్రల్​ వర్సిటీ తరఫున ఎల్​. రవిశంకర్​ వాదనలు వినిపించారు. కంచ గచ్చిబౌలి భూముల పనులను ఇవాళ్టి వరకు ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. 

హెచ్​సీయూ భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిల్‌ వ్యాజ్యాలపై కౌంటర్ల దాఖలుకు ఏజీ గడువు కోరారు. ఏజీ విజ్ఞప్తి మేరకు విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. ఈనెల 7 వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే ఇవ్వడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో రణరంగాన్ని తలపిస్తోంది. దీంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధాన గేటు వద్ద పోలీసుల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.