
అమెరికా ఆటోలపై విధించిన టారిఫ్లపై కెనడా ధ్వజమెత్తింది. ఈ టారిఫ్లు తమ దేశంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ”అమెరికా టారిఫ్లు మా దేశంపై ప్రత్యక్ష దాడి, మా కార్మికులను రక్షించుకుంటాం, మా కంపెనీలను రక్షించుకుంటాం, మా దేశాన్ని రక్షించుకుంటాం” అని ప్రధాని మార్క్ కార్నీ పేర్కొన్నారు.
అయితే ప్రతీకార చర్యలకు ముందు ట్రంప్ ఉత్తర్వులను పరిశీలించాల్సివుందని పేర్కొన్నారు. ఇది అన్యాయమని దుయ్యబట్టారు. మందస్తుగా 1.4 బిలియన్ డాలర్ల ‘వ్యూహాత్మక ప్రతిస్పందన నిధి’ని ప్రకటించారు. ఈ నిధి ట్రంప్ విధించే సుంకాల వలన ప్రభావితమైన కెనడా ఆటో ఉద్యోగాలను కాపాడుతుందని తెలిపారు.
ఆటోలు కెనడా రెండవ అతిపెద్ద ఎగుమతిగా ఉన్నాయని, ఈ పరిశ్రమలతో 1,25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుండగా, సుమారు 5,00,000 మందికి సంబంధిత పరిశ్రమలలో పరోక్షంగా ఉపాధి కలుగుతోందని తెలిపారు. కెనడా ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు.
విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. కానీ, అమెరికాలో తయారైన కార్లపై ఎలాంటి సుంకం ఉండదని స్పష్టంచేయడం విశేషం. ఈ సుంకం పెంపు వచ్చే వారం నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించారు.ఇది శాశ్వతమైన చర్యగా పేర్కొన్న ఆయన దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతియేటా 100 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనున్నదని పేర్కొన్నారు.
More Stories
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను
అమెరికా చదువుల పట్ల భారతీయ విద్యార్థుల్లో అనాసక్తి
ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం