ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో మరో మృతదేహం ఆనవాళ్లు

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో మరో మృతదేహం ఆనవాళ్లు
 శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించాయి. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్‌ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తున్నది. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయి.

కాగా, దీనిని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో అధికారులు టన్నెల్‌ లోపలికి వెళ్లారు. ఆనవాళ్లు మృతదేహానివే అయితే సాయంత్రం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే.

ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. కేరళ నుంచి వచ్చిన క్యాడవార్‌ డాగ్స్‌ సాయంతో అనుమానిత ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరుపగా టీబీఎం(టన్నెల్‌ బోర్‌ మెషిన్‌) ఆపరేటర్‌ గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహం లభించింది. మిగిలిన ఏడుగురి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

కాగా, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్‌లో అన్వేషణ కొనసాగించలేమని రెస్క్యూ అధికారులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్‌ పైకప్పు బలహీనంగా ఉన్నదని, అది కూలిపోయే అవకాశం ఉన్నదని, మొండిగా ముందుకెళ్తే రెస్క్యూ కార్మికు లు మరో ప్రమాదంలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉన్నదని అధికారులు సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

అయితే గల్లంతైన ఏడుగురి ఆచూకీ లభించేవరకు అన్వేషణ కొనసాగాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. వీటిని నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు. కాగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఈ సందర్భంగా ప్రమాదస్థలిలో నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని రెవెన్యూ (విపత్తు నిర్వహణ విభాగం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఆర్మీ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 700 మంది సిబ్బంది ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు తెలిపారు.

టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఇప్పటి వరకు ఒక మృతదేహం లభ్యమైంది. ఇప్పడు మరో మృత దేహాన్ని రెస్క్యూ టీమ్‌ గుర్తించింది. మిగిలిన వారి ఆచూకీ కనుగొనేందుకు ఎంత సమయం పడుతుందని సీఎం రేవంత్‌ ఆరా తీశారు. దీంతో ఏప్రిల్‌ 10వ తేదీ కల్లా రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.