హనీట్రాప్‌లో 48 మంది కర్ణాటక ఎమ్‌ఎల్‌ఎలు

హనీట్రాప్‌లో 48 మంది కర్ణాటక ఎమ్‌ఎల్‌ఎలు

యువతులను ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని ‘హనీట్రాప్’అంటారు. ఇప్పుడీ హనీట్రాప్ వలలో సుమారు 48 మంది ఎమ్‌ఎల్‌ఎలు పడ్డారని ఓ రాష్ట్ర మంత్రి కర్ణాటక అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.  ఇటీవల ఇద్దరు మంత్రులపై హనీట్రాప్ ప్రయత్నాలు జరిగాయని, పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్క్‌హోళ అసెంబ్లీలో వెల్లడించారు.

సీడీలు, పెన్‌డ్రైవ్‌ల్లో వారి అసభ్య వీడియోలు ఉన్నాయని తెలిపారు. అధికార పక్షం సహా విపక్షానికి చెందిన వారూ ఈ బాధితుల్లో ఉన్నారని వివరించారు. అంతేకాదు ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సన్నిహితుడు, కర్ణాటక సహకార మంత్రి కేఎన్ రాజన్నపై రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని, ఇదే అంశంపై రాష్ట్ర హోంశాఖ విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. గత 20 ఏళ్లుగా నేతల్ని హనీట్రాప్ లోకి దించడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ తరహా రాజకీయాలు చేయకూడదని పేర్కొంటూ కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఇంతటితో ఆగిపోవాలని స్పష్టం చేశారు. హనీట్రాప్‌పై మంత్రి కెఎన్ రాజన్న మాట్లాడుతూ కనీసం 48 మంది ఎమ్మెల్యేలు హనీట్రాప్‌లో పడ్డారని అభిప్రాయం వెలిబుచ్చారు. 

“గౌరవనీయులైన స్పీకర్ కర్ణాటకను సీడీలు, పెన్ డ్రైవ్‌ల ఫ్యాక్టరీ అని పిలుస్తారు. నేను కాదు, చాలా మంది. ఇది తీవ్రమైన ఆరోపణ. తుమకూరుకు చెందిన ఇద్దరు శక్తివంతమైన మంత్రులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని నివేదికలు ఉన్నాయి. ఇప్పుడు, నేను తుమకూరుకు చెందిన మంత్రులలో ఒకడిని, మరొకరు డాక్టర్ పరమేశ్వర – మేమిద్దరం మాత్రమే. చాలా కథలు బయటపడుతున్నాయి. నేను ఇక్కడ దీనికి స్పందిస్తే, అది సముచితం కాదు,” అని రాజన్న అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. 
 
హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెబుతూ పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. “దీని వెనుక నిర్మాతలు ఎవరు? డైరెక్టర్లు ఎవరు ఉన్నారు? ఇవన్నీ బయటకు రావాలి. ప్రజలు తెలుసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ప్రతిస్పందనలో జాగ్రత్తగా మాట్లాడారు.
 
“ఎవరైనా అరెస్టు చేయబడ్డారో లేదో నాకు తెలియదు. దర్యాప్తు జరగనివ్వండి. చట్ట ప్రకారం వారికి రక్షణ కల్పించాలని నేను హోంమంత్రిని అభ్యర్థిస్తున్నాను” అని ఆయన అంతకుముందు పేర్కొన్నారు. అయితే, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈ ఆరోపణల గురించి తనకు తెలియదని, సంబంధిత శాఖ నుండి సమాచారం కోరుతానని చెప్పారు.
 
“నేను ఆ శాఖ నుండి కొంత సమాచారం అడుగుతాను. ఇప్పటివరకు ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు. నాకు ఈ విషయాలన్నీ తెలియవు. ఆ శాఖ మాకు తెలియజేసినప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది. చాలా ఊహాగానాలు జరుగుతుండవచ్చు, కానీ ఆ శాఖ నుండి కొంత సమాచారం ఇవ్వాలని నేను అడుగుతాను” అని ఆయన చెప్పారు. 

ప్రస్తుతం ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు.  ఇప్పటికే హనీట్రాప్‌పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఇంతకు ముందు బుధవారం బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ ఎవి సునీల్ కుమార్ కొంతమంది రాష్ట్ర మంత్రులు, నాయకులు హనీట్రాప్‌లో చిక్కుకున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయని, ఈ వదంతులపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరిన తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. 

కాంగ్రెస్‌లో వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైన నాటి నుంచి హనీట్రాప్ వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశానని రాజన్న చెప్పారు.