దేశంలో పెరుగుతున్న డిజిటల్‌ అరెస్ట్‌ కుంభకోణాలు

దేశంలో పెరుగుతున్న డిజిటల్‌ అరెస్ట్‌ కుంభకోణాలు
గత మూడు సంవత్సరాల కాలంలో దేశంలో డిజిటల్‌ అరెస్ట్‌ కుంభకోణాల సంఖ్య పెరిగిపోయింది. మోసగాళ్లు బాధితులకు ఆడియో లేదా వీడియో కాల్స్‌ చేసి తాము సిబిఐ, ఇడి, ఐటి అధికారులమని చెప్పి భయపెడుతూ వారి నుండి సొమ్మును దోచుకుంటున్నారు.  2022లో ఇలాంటి డిజిటల్‌ అరెస్ట్‌ కుంభకోణం కేసులు 39,925 నమోదయ్యాయని జాతీయ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సిఆర్‌పి) తెలిపింది.
వాటి కారణంగా బాధితులు రూ.91 కోట్లు నష్టపోయారు. అయితే 2024 నాటికి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి 1,23,672కు చేరుకున్నాయి.  అంటే 2022లో నమోదైన కేసులతో పోలిస్తే సుమారు మూడు రెట్లు అధికంగా కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఈ కేసుల కారణంగా బాధితులు రూ.1,935.5 కోట్లు 2022లో కంటే 20 రెట్లు అధికంగా నష్టపోయారు.
ప్రస్తుత సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే 17,718 కేసులు నమోదయ్యాయి. బాధితులు రూ.210.2 కోట్లు నష్టపోయారు. డిజిటల్‌ అరెస్ట్‌ సందర్భాల్లో బాధితులు సాధ్యమైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందగానే వారు ఆ బ్యాంక్‌ ఖాతాను ఫ్రీజ్‌ చేయిస్తారు. బదిలీ చేసిన సొమ్మును విత్‌డ్రా చేయకుండా బ్లాక్‌ చేస్తారు. ఆ తర్వాత ఆ ఖాతా ఎవరిది, ఫోన్‌ చేసిందెవరు అనే దానిపై ఆరా తీస్తారు.  మోసగాళ్లు తమ డిజిటల్‌ ఫుట్‌ప్రింట్లను చెరిపేసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు పలు కేసుల్లో వారిని గుర్తించి కటకటాల వెనక్కి నెట్టారు.