అవిశ్వాస తీర్మానంకు భయపడి గుంటూరు మేయర్ రాజీనామా

అవిశ్వాస తీర్మానంకు భయపడి గుంటూరు మేయర్ రాజీనామా
అవిశ్వాస తీర్మానంకు భయపడి గుంటూరు నగర కార్పొరేషన్ మేయర్, వైసిపి నేత  కావటి మనోహర్ నాయుడు ముందుగానే రాజీనామా చేశారు. 2021లో వైఎస్సార్సీపీ నుంచి మేయర్ పదవికి ఎన్నికైన కావటి మనోహర్ నాయుడు, మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మేయర్ పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది.


మరోవైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైఎస్సార్సీపీ నుంచి కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరటంతో ఆ పార్టీ అభ్యర్థులకు పరాజయం తప్పలేదు. దీంతో ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు మీద అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరో ఏడాది పదవీ కాలం ఉండగానే కావటి రాజీనామా చేశారు.

కాగా, ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ సీటు గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం టీడీపీ పక్ష నాయకునిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర మేయర్ అయితే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ పెమ్మసాని వెల్లడించారు.

అయితే పెమ్మసాని ఒక్కసారిగా మేయర్ ప్రస్తావన తీసుకురావటంపై టీడీపీలోని కొంతమంది కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొంతమంది సమావేశం నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం. అధిష్ఠానం ఎవరి పేరుని మేయర్గా ప్రకటిస్తే వారికి మద్దతిస్తామని కార్పొరేటర్లు తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు కలిపి 31 మంది సభ్యుల మద్దతు దక్కింది.

వైఎస్సార్సీపీలో గెలిచి డిప్యూటీ మేయర్గా ఉన్న సజీల గత ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. ఆమెను అలాగే కొనసాగించినా మరో డిప్యూటీ మేయర్ సీటు ఉంటుంది. అది జనసేనకు దక్కే అవకాశం ఉంది. కోవెలమూడి రవీంద్ర సాధారణ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ సీటు ఆశించారు. అయితే సామాజిక సమీకరణల్లో భాగంగా ఆ సీటు గల్లా మాధవికి దక్కింది. దీంతో ఆయన మేయర్ పదవి తనకే వస్తుందని భావిస్తున్నారు.