సుంకాలు తగ్గించింది ట్రంప్ ఒత్తిడి వల్ల కాదు

సుంకాలు తగ్గించింది ట్రంప్ ఒత్తిడి వల్ల కాదు

* వాణిజ్య సంబంధాల బలోపేతానికే… భారత్‌ స్పష్టం!

భారత్‌ అధికంగా సుంకాలు వసూలు చేస్తోందన్న విషయాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే ఆ దేశం సుంకాలను తగ్గించేందుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకోవడంపై భారత్‌ స్పందించింది. ట్రంప్‌ వ్యాఖ్యలను భారత అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. సుంకాల తగ్గింపు చర్యలు నిజమే అయినా ట్రంప్‌ ఒత్తిడి ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. 
 
అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పాయి.  గతంలో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, స్విట్జర్లాండ్‌, నార్వే లాంటి దేశాలపై భారత్‌ సుంకాలను తగ్గించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఇప్పుడు ఐరోపా సమాఖ్యతో, యూకేతో పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సుంకాలను తగ్గించాలని న్యూఢిల్లీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అంతేతప్ప అమెరికా భారత్‌పై విధించనున్న సుంకాల భయంతో కాదని పేర్కొన్నారు.
 
“గతంలో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలోనే, భారత్‌ వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే లాంటి దేశాలపై సుంకాలను తగ్గించింది. ప్రస్తుతం ఐరోపా సమాఖ్య, యూకేతో కూడా పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వీటిని తగ్గించాలని భారత్‌ నిర్ణయం తీసుకుంది. అంతే కానీ, అమెరికా భారత్‌పై విధించనున్న సుంకాల అమలుకు సమయం దగ్గరపడుతున్నందుకు కాదు” అని భారత అధికారులు చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నివేదికల ప్రకారం, వ్యవసాయ ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని వస్తువులపై సుంకాలను తగ్గించాలని అమెరికా భారత్‌ను కోరింది. వాస్తవానికి భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 

కాగా 2030 నాటికి దీనిని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తోంది. గత నెల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో 2025 చివరి నాటికి ఇరుదేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొలిదశపై చర్చలు జరపడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారు. 

ఇందులో భాగంగానే మరిన్ని వస్తువులకు మార్కెట్‌ను తెరవడం, టారిఫ్‌ అడ్డంకులను తొలగించడానికి ఇరుదేశాల నేతలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.  భారత్‌ను టారిఫ్‌ కింగ్‌గా అభివర్ణిస్తూ, తమ వస్తువులపై భారీగా టారిఫ్‌లు విధిస్తోందని ఆయన ఆరోపించారు. 

ఏప్రిల్‌ 2న భారత్‌, చైనాలపై విధించే సుంకాలు అమెరికా దశను మార్చనున్నాయని ట్రంప్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బీటీఏ కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టం చేసింది.