
2023 అక్టోబర్ 7 నాటి ఘటనకు ముందు హమాస్ సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. నాటి ఘటనలో తమ దేశ పౌరులను రక్షించుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించింది. తాజాగా నాటి ఘటనపై ఐడీఎఫ్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది.
హమాస్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేదని తాము భావించామని, ఒక వేళ పరిస్థితులు మారినట్లు కనిపిస్తే అందుకు సిద్ధంగా ఉండడానికి తమకు సమయం దొరికేదని ఐడీఎఫ్ వెల్లడించింది. అయితే హమాస్ దాడి చేస్తుందని అనుకోలేదని, అనూహ్య దాడితో తాము దాన్ని ఎదుర్కోవడానికి సమయం దొరకలేదని పేర్కొంది.
గాజా స్ట్రిప్లో జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా యుద్ధం చేయాలనే ఆలోచన నుంచి హమాస్ను దారి మళ్లించవచ్చని భావించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ చేపట్టిన ఈ దర్యాప్తు అక్టోబర్ 7 నాటి ఘటనకు ముందు, తర్వాత పరిస్థితులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఐడీఎఫ్ వ్యూహాలు, యుద్ధ సన్నద్ధత, ఇంటెలిజెన్స్కు సంబంధించిన అంశాలను దర్యాప్తును పరిశీలించింది.
2023 అక్టోబర్ 7నాటి ఘటనలో ఊహకందని రీతిలో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 250 మందికిపైగా హమాస్ చేతిలో బందీలుగా చిక్కుకున్నారు.
దీంతో గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపింది. హమాస్ అగ్రనేతలతో సహా, మిలిటెంట్లు లక్ష్యంగా గాజా స్ట్రిప్లో వైమానిక, భూతల దాడులు జరిపింది. దీంతో హమాస్ అధినేత యహ్యా సిన్వర్తో సహా వేల మంది మిలిటెంట్లు మరణించారు. 48,000 మంది పౌరులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం ప్రకటించింది. ఈ యుద్ధంలో 400 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు.
గాజా కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండో దశ చర్చలు ప్రారంభమయ్యాయని ఈజిప్ట్ తెలిపింది. ఇజ్రాయెల్, ఖతార్, యూఎస్ అధికారులు కైరోలో కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశపై తీవ్రమైన చర్చలు ప్రారంభించారని పేర్కొంది. కాగా, ఆరు వారాల తొలి దశ కాల్పుల విరమణ శనివారంతో ముగియనుంది.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!