ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం
 
* ఆమె నగర అభివృద్ధికి పూర్తి శక్తితో కృషి చేస్తారని మోదీ విశ్వాసం
 
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గురువారం ప్రమాణం చేయించారు. ఢిల్లీ మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశీశ్ సూద్, మంజిందర్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్, కపిల్ మిశ్ర, పంకజ్ కుమార్‌ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. 
డిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌ నాథ్‌ సింగ్, అమిత్‌ షా సహా పలువురు కేంద్రమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఇతర బిజెపి- ఎన్​డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
 
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తాను అభినందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమె అట్టడుగు స్థాయి నుండి ఎదిగారని, నగర అభివృద్ధికి పూర్తి శక్తితో కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తొలిసారి బిజెపి ఎమ్మెల్యే అయిన గుప్తా, 26 సంవత్సరాలకు పైగా తర్వాత నగరంలో తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ చేసిన గొప్ప బల ప్రదర్శనలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
కొత్త ఢిల్లీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మోదీ ఒక అభినందన సందేశంలో, “ఆమె అట్టడుగు స్థాయి నుండి ఎదిగింది. క్యాంపస్ రాజకీయాలు, రాష్ట్ర సంస్థ, మున్సిపల్ పరిపాలన, ఇప్పుడు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిగా ఉన్నారు” అని పేర్కొన్నారు. “ఆమె పూర్తి శక్తితో ఢిల్లీ అభివృద్ధికి కృషి చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఆమె పదవీకాలం ఫలప్రదంగా ఉండాలని నా శుభాకాంక్షలు” అని తెలిపారు. 

రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నామని చెప్పారు. ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం ఆనందంగా ఉందని చెబుతూ ఇప్పుడు దేశ రాజధానిలో కొత్త శకం మొదలైందని, ఇకపై అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమం జరగబోతుందని వెల్లడించారు.

1974 జులై 19న హరియాణాలోని జుల్నాలో జన్మించారు రేఖా గుప్తా. డిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌ రామ్‌ కళాశాలలో బీకాం పూర్తి చేశారు. 1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలిగానూ సేవలు అందించారు. 

 
మేరఠ్‌లోని చౌధరీ చరణ్‌ సింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు.  1998లో మనీశ్‌ గుప్తాను రేఖా గుప్తా పెళ్లి చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్‌ కౌన్సిలర్​గా గెలుపొందారు. అనంతరం దక్షిణ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. 
 
ఆర్ఎస్ఎస్​తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్‌ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్‌బాగ్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పగించింది బీజేపీ అధిష్ఠానం.

రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా సీఎంగా సేవలు అందించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్‌ (బీజేపీ), షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌), ఆతిశీ (ఆప్‌) ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అలాగే బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్‌ పటేల్‌ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఐదో మహిళగా రేఖా గుప్తా నిలిచారు. 

అలాగే దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టిన 18వ మహిళగా రేఖా గుప్తా ఉన్నారు. మరోవైపు, రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ భద్రత కేటాయించింది. అతిశీ సీఎంగా ఉన్న సమయంలో ఆమెకు కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించింది.