వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

విశాఖపట్నంలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో   సీనియర్ల హింసాత్మక ప్రవర్తన మరోసారి కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లపై దాడికి పాల్పడటంతో ఈ ఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.  విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పై ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ‘యువతరంగ్’ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు డ్యాన్స్ చేశారు.  ఈ క్రమంలో, ఒక సెకండ్ ఇయర్ విద్యార్థి అనుకోకుండా థర్డ్ ఇయర్ విద్యార్థికి కాలు తగిలాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న సీనియర్ విద్యార్థి, క్షమాపణలు చెప్పినా వినకుండా, తన స్నేహితులతో కలిసి సెకండ్ ఇయర్ విద్యార్థిని దారుణంగా కొట్టాడు. బాధిత విద్యార్థి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

దువ్వాడ పోలీసులు ఈ కేసును విచారించి, బాధ్యులపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం సరిగ్గా వ్యవహరించడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో కూడా ఇదే కళాశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా, విద్యార్థుల పట్ల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కళాశాల యాజమాన్యం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంతలోనే, ఆల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్‌లో మరో దారుణ ఘటన జరిగింది. టెన్త్ క్లాస్ విద్యార్థినులు సిగరెట్ త్రాగుతున్నట్లు ప్రిన్సిపాల్‌కు చెప్పుతానని ఓ 7వ తరగతి విద్యార్థిని హెచ్చరించడంతో, కోపోద్రిక్తులైన పెద్ద విద్యార్థినులు ఆమెను బంధించి దాడి చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, డీఈఓ (జిల్లా విద్యాశాఖాధికారి) ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనలు విద్యాసంస్థల్లో భద్రతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి. 

ఇంజనీరింగ్ కళాశాలలు, హాస్టల్స్ లో విద్యార్థుల ప్రవర్తనపై పర్యవేక్షణ లేకపోవడం, శిక్షా వ్యవస్థలో కఠిన చర్యలు లేకపోవడం, వ్యవస్థలో ఉన్న లోపాలను తెలియజేస్తున్నాయి. కళాశాల యాజమాన్యాలు, విద్యాసంస్థలు విద్యార్థుల భద్రతపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజంలోని పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. రవాణా, భద్రతా, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేస్తేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి.