హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు

హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
హైదరాబాద్ లోని టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున హనుమాన్ దేవాలయంలో శివాలయం ఉంది. అయితే ఈ ఆలయంలో శివలింగం వెనుక భాగంలో గుర్తుతెలియని దుండగులు మాంసపు ముద్దను వేయడంతో ఉదయం దర్శనానికి వచ్చిన భక్తులు ఇది గమనించి ఆందోళనకు గురయ్యారు.
 
దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, హిందువులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరగాలని, నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సిబ్బంది, భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.

ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను అపవిత్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక చోట్ల ఇదే జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవిత్ర ఆలయాల్లో కొంతమంది కావాలని ఆవు మాంసం పడేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

కాగా, ఆలయంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హైదరాబాద్ జాయింట్ సీపీ విక్రమ్ సింగ్ హెచ్చరించారు. సంఘటన స్థలాన్ని ఇవాళ సీపీ విక్రమ్ సింగ్ పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, ఈరోజు సాయంత్రం వరకు అక్కడ సీసీటీవీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా పోలీసులు నిందితులను పట్టుకొని వారిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతవరకు సమన్వయం పాటించాలని ప్రజలను కోరారు.