తప్పుడు ఔషధ ప్రకటనలపై `సుప్రీం’ ఆగ్రహం

తప్పుడు ఔషధ ప్రకటనలపై `సుప్రీం’ ఆగ్రహం
తప్పుదోవ పట్టించే ఔషధ ప్రకటనల విషయంలో సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించినప్పటికీ, న్యాయస్థానం ఆదేశాలను ఎందుకు పాటించడంలేదని ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ నెలాఖరులోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని, తదుపరి విచారణ జరిగే మార్చి 7న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుకు హాజరు కావాలని ఆయా రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.  ఆయుర్వేదిక్‌, సిద్ధ, యునానీ ఔషధాల గురించి చట్టవిరుద్ధమైన రీతిలో వాణిజ్య ప్రకటనలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌తో సహా పలు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను సోమవారం పిలిపించిన సుప్రీంకోర్టు వారిని మందలించింది.
 
ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఔషధ ప్రకటనలు ఉంటున్నాయంటూ పతంజలి సంస్థ, యోగా గురు రామ్‌దేవ్‌బాబాపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ 2022 ఆగస్టు 10న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో, ఈ తరహా ప్రకటనలపై తీసుకున్న చర్యల గురించి అఫిడవిట్లు దాఖలు చేయాలని గత ఏడాది మే 7న అన్ని రాష్ర్టాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
అమికస్‌ క్యూరీగా హాజరైన సీనియర్‌ న్యాయవాది షాదన్‌ ఫరాసత్‌ వాదనలు వినిపిస్తూ, చాలా రాష్ట్రాలు క్షమాపణలను ఆమోదించాయని, ఉల్లంఘించిన వారిని నిర్దోషులుగా విడుదల చేస్తూ చర్యలు తీసుకున్నాయని తెలిపారు. 
 
డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ రూల్స్‌, 1945లోని 170వ నిబంధనను రాష్ట్రాలు సంపూర్ణంగా అమలు చేయడం ఆరంభిస్తే అమికస్‌ క్యూరీ చెప్పినట్లుగా ఆయుర్వేదం, సిద్ధం, యునాని ఔషధాల అక్రమ వాణిజ్య ప్రకటనల సమస్య గణనీయంగా పరిష్కరించబడుతుందని బెంచ్‌ పేర్కొంది. ఈ కోర్టు ఇందుకు సంబంధించి అనేక ఆదేశాలను జారీ చేసినా రాష్ట్రాలు వాటిని అమలు చేయడం లేదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. 
 
170వ నిబంధన అమలుపై స్పందనతో సహా అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, గోవా, గుజరాత్‌, జమ్ముకాశ్మీర్‌లను సుప్రీం ఆదేశించింది. తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలు నిషేధించే 170వ నిబంధనను తొలగిస్తూ ఆయుష్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై గతేడాది ఆగస్టు 27న సుప్రీం స్టే విధించింది.