చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి

చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ కుటుంబంపై దాడి జరిగింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు హిందూ సంస్థ పేరుతో పూజారి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగరాజన్, అతని కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి మూడ్రోజులు కాగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

వీసా బాలాజీ టెంపుల్‌గా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ ప్రధాన అర్చకుడిని చేస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ పరిధిలోని ఆలయానికి సమీపంలోనే అర్చకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. మూడు రోజుల కిందట పూజా కార్యక్రమాల అనంతరం రంగరాజన్ తన నివాసానికి చేరుకున్నారు. 

అయితే రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కొంతమంది వ్యక్తులు పూజారి ఇంటికి వెళ్లారు. వారిని ఇంట్లోకి ఆహ్వానించిన ఆయన మాటలు కలిపారు. అయితే వచ్చిన వారి ప్రవర్తన, మాట తీరు సరిగా లేకపోవడంతో మద్దతు ఇచ్చేందుకు అర్చకుడు నిరాకరించారు. దీంతో అక్కడే ఉన్న రంగరాజన్ కుమారుడిపై నిందితులు దాడికి పాల్పడ్డారు. అనంతరం రంగరాజన్‌పైనా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. 

కాగా, ఘటనపై ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారితోపాటు సహకరించిన వారినీ పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వీరరాఘవరెడ్డి అనే వ్యక్తే దాడి చేసినట్లు గుర్తించారు. అనంతరం అతనితోపాటు 20 మంది అనుచరులను సైతం అదుపులోకి తీసుకున్నారు.

సౌందర్ రాజన్ హిందూ ధార్మిక వ్యవహారాల పైన తరచూ స్పందిస్తూ ఉంటారు. తాజాగా ముత్యాలమ్మ ఆలయం ఘటన సమయంలోనూ సందర్శించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్ కు మద్దతు ఇచ్చారు.