ఢిల్లీలో విజయం దిశగా బీజేపీ

ఢిల్లీలో విజయం దిశగా బీజేపీ

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తుండగా, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. 

డిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్‌ ఫిగర్‌ (36)ను దాటేసి అత్యధిక మెజార్టీలో కనబరుస్తోంది. ఉదయం 10.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే, ప్రస్తుతం బిజెపి 41 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆప్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. 

కాంగ్రెస్‌ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లే కన్పించినా ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. బిజెపి దూకుడు ఆఖరి వరకు కొనసాగితే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవడం ఖాయమనే చెప్పాలి. ఆప్ గట్టి పోటీ ఇస్తున్నా.. బీజేపీ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరుత్సాహపర్చింది. హస్తినలో మరోమారు చేతులెత్తేసింది హస్తం పార్టీ.

న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ వెనుకబడ్డారు. ఆరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్ధి పర్వేశ్ సాహేబ్ సింగ్ వర్మ 225 ఆధిక్యంలోకి వచ్చారు. శకూర్‌బస్తీలో ఆప్ నేత సత్యేంద్ర జైన్ వెనుకబడ్డారు. ఆయన బీజేపీ అభ్యర్ధి కంటే 6,524 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. 
 
అలాగే, సీఎం అతీషి కూడా మళ్లీ వెనుకబడ్డారు. ఆమెపై బీజేపీ అభ్యర్ధి రమేశ్ బిదూరి 1300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీపై ఆప్‌ అభ్యర్థి నవీన్‌ చౌధరి 5,085ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

1998 నుండి ఢిల్లీలో అధికారంలో లేని బిజెపి, 2013 నుండి ఆధిపత్యం చెలాయించిన ఆప్‌ను ఓడించడానికి అహర్నిశలు పోరాడింది. 2015 ,2020లో జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో, ఆప్ బిజెపిని వరుసగా మూడు, ఎనిమిది స్థానాలకు పరిమితం చేసి ఓడించింది. ఢిల్లీలో ఒకప్పుడు అజేయంగా భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ – దేశ రాజధానిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన తొలి ఓటమిని చవిచూడబోతోంది.