ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలు రాజీనామా

ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలు రాజీనామా

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు షాక్‌ తగిలింది. అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు పార్టీపై తమకు నమ్మకం పోయిందని ఆయనకు రాసిన లేఖలో ఆరోపించారు. 

ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్ (మెహ్రౌలి), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావన గౌడ్ (పాలం), బీఎస్ జూన్ (బిజ్వాసన్) ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అరవింద్‌ కేజ్రీవాల్‌కు పంపారు.

నరేష్ యాదవ్ శుక్రవారంఉదయం తన రాజీనామాను ప్రకటించడంలో పార్టీలో అంతర్గత కలహాలు ముదిరినట్టు ఊహాగానాలు మొదలయ్యారు. అయితే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం పార్టీకి గట్టిదెబ్బగా అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్‌‌కు గట్టి సవాలు కావచ్చని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసినట్టు ప్రచారం జరుగుతుండగా, వీరి తదుపరి చర్యపై కూడా చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు. 

మరోవైపు, ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాపై ఆప్ సైతం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, సామూహిక రాజీనామాలతో కీలక నియోజకవర్గాల్లో ఆప్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.