
* ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ఛార్జీలు
ఉబర్, ఓలా వంటి యాప్లు ఒకే దూరానికి ఆండ్రాయిడ్లో ఒక ఛార్జీని, ఆపిల్ ప్లాట్ఫామ్లో వేరొక ఛార్జీని వసూలు చేస్తుండటంపై ఇటీవలే పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఉబర్, ఓలా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ఒకే సర్వీసుకు రెండు సంస్థలూ వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా చర్యలకు ఉపక్రమించింది. ఛార్జెస్ వసూలు, అందుకు అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో కోరింది.
వివక్షతకు సంబంధించి ఆందోళనల్ని పరిస్కరించాలని స్పష్టం చేసింది. ఈ పద్ధతిని స్పష్టంగా ధరలను ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. ఛార్జీల వసూలులో పారదర్శకత, న్యాయాన్ని నిర్ధారించడానికి వివరణాత్మక ప్రతిస్పందన కోరింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వారితో పోలిస్తే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడుతుందా? ఐఫోన్ వినియోగదారులను ధనికులుగా చూస్తూ కంపెనీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయా? చాలాకాలంగా వినియోగదారుల్లో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలుమార్లు సోషల్ మీడియా వేదికగా కొందరు ఇది నిజమేనని నిరూపించి, క్యాబ్ సర్వీసుల కంపెనీల తీరును ఎండగట్టారు. ఇటీవలే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి, ఈ ధరల్ని వేర్వేరు మొబైళ్లలో పోలుస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియా చేపట్టిన పరిశీలనలోనూ ఈ విషయం వెల్లడయ్యింది.
చెన్నైలోని మూడు రూట్లలో ఈ సంస్థ ప్రతినిధులు ఆండ్రాయిడ్, ఐఫోన్ల నుంచి ఒకే సమయంలో క్యాబ్లు బుక్ చేశారు. మూడు రూట్లలోనూ ఆండ్రాయిడ్ నుంచి బుక్ చేసిన వారి కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడింది. మదిపక్కం నుంచి వెలచెరి ఫియోనిక్స్ మాల్కు ఆండ్రాయిడ్ నుంచి క్యాబ్ బుక్ చేస్తే రూ.195 పడగా, ఐఫోన్ నుంచి బుక్ చేసిన వ్యక్తికి రూ.260 పడింది.
టీనగర్ నుంచి ఎగ్మోర్కు ఆండ్రాయిడ్ యూజర్కు రూ.180 పడగా, ఐఫోన్ యూజర్కు రూ.344 పడింది. అవది నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు ఆండ్రాయిడ్లో రూ.961 పడగా, ఐఫోన్లో రూ.1,010 పడింది. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ఫోన్ బ్యాటరీ పర్సంటేజీ తక్కువగా ఉన్నప్పుడు క్యాబ్ సంస్థ ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తోందంటూ డిల్లీకి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే క్యాబ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ ఫోన్ మోడళ్ల ఆధారంగానే కాదు, అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజీ బట్టి కూడా ఛార్జీల్లో వ్యత్యాసం చూపిస్తోందని తెలిపారు.
రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఓఎస్ డివైజులు వినియోగించి పరిశీలించినప్పుడు దీన్ని గుర్తించినట్లు చెప్పారు. అన్ని డివైజుల్లోనూ ఒకే అకౌంట్తో లాగిన్ అయి ఒకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసినప్పుడు ఫేర్లో ఈ తేడా గుర్తించినట్లు పేర్కొన్నారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!