ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం

ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
 
*చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి
 
చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీల జోడి ఏపీలో మూడింతల ప్రగతి సాధిస్తుందని భరోసా ఇస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో కేంద్రం ఏపీకి రూ 3 లక్షల కోట్ల మేరకు సహాయం అందించినట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌నుఅన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కంకణబద్దులై ఉన్నారని ఆయన వెల్లడించారు. “చంద్రబాబు వెనుక మేమంతా ఉన్నాం… ఏపీని అభివృద్ధి చేస్తాం” అని హామీ ఇచ్చారు.
 
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో రూ. 160 కోట్లతో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ( ఎన్‌ఐడీఎం), ఎన్డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స ్యాబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ 2019 నుంచి ఏపీని ఏవిధంగా ధ్వంసం చేశారో మనమంతా‌ చూశామని తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో కూటమి పార్టీలను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణానికి 27 వేల కోట్లను హడ్కో, ప్రపంచ బ్యాంక్‌ ద్వారా రుణాలుగా అందించారని అమిత్ షా గుర్తు చేశారు. 

 
విశాఖ స్టీల్‌ కర్మాగారానికి ఇటీవల రూ.11,440 కోట్లను మంజూరు చేశారని వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధులు మంజూరు చేసినందున 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పోలవరం జలాలు అందుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గ్రీన్‌ పార్కు నిర్మాణానికి రూ. 2 లక్షల కోట్లతో పెట్టుబడులతో పనులు ప్రారంభించారని, విశాఖ రైల్వే జోన్‌ను కూడా పట్టాలెక్కించామని ఆయన వివరించారు.

‘‘స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం ముడి పడి ఉంది. సున్నితమైన అంశంలో కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడ్డారు. గత ఐదేళ్లల్లో రాజధాని నిర్మాణం నిలిపివేశారు. ఇప్పుడు కూటమి వచ్చాక కేంద్రం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించింది. రైల్వే జోన్ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకుంది” అని అమిత్ షా తెలిపారు. 

 
“ఏపీకి జీవధార అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేసి 2028 నాటికి నీరు ఇచ్చి తీరుతాం. రూ. 2 లక్షల కోట్లతో విశాఖపట్నం గ్రీన్ ఎనర్జీకి కేటాయించాం. ఎయిమ్స్‌ను రూ. 1600 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. రూ. 1.20 లక్ష కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతుంది” అని చెప్పారు.

 
అమిత్ షా పని తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2014లో  ఎన్డీఆర్‌ఎఫ్‌ కార్యాలయం కోసం కుస్థాపన ేశామని గుర్తుచేశారు. 2018లో ఇక్కడ  ఎన్‌ఐడీఎం కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటి‌కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని, నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామని చెప్పారు. 
 
ఎటువంటి విపత్తు వచ్చినా సమర్ధవంతంగా  ఎన్డీఆర్‌ఎఫ్‌ పని చేస్తుందని,  కొన్ని లక్షల మంది ప్రాణాలను వారు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారని ముఖ్యమంత్రి కొనియాడారు. నీరు, భూమి, ఆకాశం ఎక్కడైనా వారు సేవలు అందించడంలో ముందుంటారని తెలిపారు. హుద్ హుద్ తుఫాన్, విజయవాడ వరదల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. సిబ్బందికి అవసరమైన అన్ని వనరులు ప్రభుత్వం పరంగా అందించారని వెల్లడించారు. టెర్రరిస్టు, నక్సలైటు, ఇతర సమస్యలను అమిత్ షా బాగా పరిష్కరించారని సీఎం చంద్రబాబు తెలిపారు.