ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌ నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇవాళ ఉదయం డిస్ట్రిక్ట్‌ రిజర్వ్ గార్డ్స్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ , స్థానిక పోలీసులు సంయుక్తంగా మావోయిస్టుల కోసం సెర్చింగ్ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి.

బీజాపూర్‌ జిల్లా మద్దేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బందిపొరా-కోరెన్‌జోడ్‌ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు వైపుల నుంచి కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  నారాయణపూర్‌ జిల్లాలో కూడా మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వారు నక్సల్స్‌కు సంబంధించిన బారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఈ మధ్యకాలంలో మావోయిస్టుల కోసం సెర్చింగ్‌ను పోలీసులు ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో ఈ నెల 4న బస్తర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో కూడా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ నెల 6న మావోయిస్టుల కోసం గాలిస్తున్న డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ ఘటనలో 8 మంది జవాన్‌లతోపాటు డ్రైవర్‌ మరణించారు.