పోలీసుల విచారణకు పేర్ని నాని సతీమణి జయసుధ

పోలీసుల విచారణకు పేర్ని నాని సతీమణి జయసుధ
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం జయసుధ విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ ఏ1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. 

బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని నివాసానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అతికించి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పేర్ని జయసుధ న్యాయవాదులతో కలిసి బందరు తాలూకా పోలీస్‌స్టేషన్‌ వచ్చారు.

కాగా, న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రభుత్వ వాహనంలో విచారణకు రావొచ్చా? అంటూ చర్చ జరుగుతోంది. మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను పోలీసులు పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించలేదు. స్టేషన్ బయటే ఆపివేశారు.  ఆర్. పేట సీఐ ఏసుబాబు పేర్ని జయసుధను ప్రశ్నిస్తున్నారు.

రేషన్ బియ్యం కేసు విషయానికి వస్తే  పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తేడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గోడౌన్ పేర్ని జయసుధ పేరు మీద ఉండగా తనిఖీల్లో తేడా వచ్చిన రేషన్ బియ్యానికి సంబంధించిన రూ.1.68కోట్ల జరిమానాను పేర్ని జయసుధ చెల్లించారు.

ఇంకోవైపు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రంగంలోకి దిగి తనిఖీలు  చేపట్టగా మొత్తం 378 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు తేల్చారు. దీంతో మిగతా బియ్యానికి కూడా జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.  ఇంతలో ఈ వ్యవహారంలో పేర్ని జయసుధ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. దాంతో ఆమె జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందీ కోర్టు. అయితే పోలీస్ విచారణకు సహకరించాలంటూ కోర్టు ఆమెకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పోలీస్ విచారణకు హాజరయ్యారు.